అంశం: పతనం
తేది: 23-11-2020
శీర్షిక : చిరునామా దొరకొచ్చు...
సంఖ్య: 50
సత్యయుగం త్రేతాయుగం
ద్వపార యుగం దాటుకుని
ఒక్కొక్కటిగా ఒరిగిపోతూ కలిలో
ఒంటరిదైపోయింది ధర్మం ....
పాలిథీన్లను పక్కన పెట్టుకుని
పర్యావరణ పాఠాలు చదువడం
కబేళాలే ఊరి పొలిమేరలకు
కంచెలౌతుంటే కల్తీల వింతలు
కాలక్షేపం ప్రజలకు పాలకులకు ....
సప్తవర్ణాల సరిగమలతో
గుప్తంగా దూరిపోతుంటే
ప్రతి కాయగూరల్లో పండ్లలో
కాలుష్యాల కబుర్ల కాకరకాయలు ....
నీతి నిజాయితీలకు
ఒత్తిళ్లేక్కువై ఒరిగిపోతూ
కాసుల వేటలో కళ్ళు
మూసుకుంటున్న గణాలు ...
ధవళ వస్త్రాల కైనీడల్లో
దాగుడుమూతల పందెంలా
స్వార్థం మాత్రమే చంకనేసుకున్న
వారినడిగితే చిరునామా దొరకొచ్చు ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment