నిర్లక్ష్యం
తేది: 15-04-2021
శీర్షిక: పరిపక్వత...
కవిత సంఖ్య: 108
కడుపులో పెట్టుక కళ్ళలో వత్తులేసుకుని
కదలికలకు కూడా కళ్లెమేసుకుని
కందిపోతుందేమోనని కనిపించని
గుడ్డు దశనుండి గడ్డు రోజులు గడిపి....
క్షణమొక యుగంలా అంగలార్చిన
అమ్మ కష్టం గుర్తించని వైనం.....
పచ్చి పుండులాంటి ఒళ్ళంతా నొప్పులతో
ఆపసోపాలు పడుతూ కూడా
అరచంచాడు పాల చొప్పున
అప్పుడప్పుడు పట్టించంగ...తేరుకుని
ఆబగా అదుముకుని తాగిన
ఆనవాళ్లు మరచిన మనిషి తత్వం ....
పీల్చేది ఈ గాలి పరిమళాలు
తాగేది ఈ సెలయేటి జలాలు
తినేది ఇక్కడి పాడిపంటలు
అయినా తెల్లవారింది మొదలు
వినేది పరాయి మాటల బోధనలు .....
విజ్ఞానములో మిన్నంటూ వర్రవీగి
వితండవాదం చేసే మనిషికి...
పశు పక్ష్యాదులకున్న పాటి
పరిపక్వత లేదేమోనని
వదులుతున్న ఆనవాళ్లు సుమా ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment