నదీమ తల్లి
తేది:20-04-2021
శీర్షిక: మహోన్నత మాతృమూర్తి ....
అవును! ఆమె ఓ మహా నది
కోట్ల మంది బిడ్డల క్షేమాలకై
అనుక్షణం ఆరాటపడుతున్న
మహోన్నత మాతృమూర్తి !
రుధిరం కరిగించిన అమ్మ
స్తన్య ధారలు పాలుగా ఇచ్చి
ప్రాణాలు నిలిపినట్టుగా ....
మనిషి ఆగడాల కలుషితాలను
కరి మింగిన వెలగపండులా మింగి...
కాలకూటాలను హరాయించుకుని
అమృత జలధారలను తాగునీటికి
సాగునీటికి కరుణిస్తున్న నదీమ తల్లి ...
సంజీవని సమమైన వనమూలికలను
సంపదల నిలయమైన వజ్రవైడూర్యములను
అపార విలువైన ఖనిజ భూగర్భ నిలువలను
తేరగా అప్పగిస్తున్న అమృత వర్షిణి అమ్మ ....
అయినను... కొంతమంది ఇంకా
స్వార్థ దాహాలు చల్లారక
ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ
గాట్లు పెడుతూ రాక్షసానందాలు
పొందుతున్నారు ....
అన్నీ కడుపులో దాచుకుని
బిడ్డల క్షేమమే తన వంతుగా
భావిస్తూ... పుట్టుక నుండి
పుడకల వరకూ సేవలందిస్తున్న
మహోన్నత మాతృమూర్తి ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment