Tuesday, May 29, 2018

అమ్మ ప్రేమ



"అ " అంటే అనుక్షణం " మ్మ" అంటే మరువకూడనిది 

అనుక్షణం అనుభవిస్తుంది  అమ్మ వేదన 
ఒక్క  పదంతో తీర్చుకోగలమా మనం  ?
అనుక్షణం అందిస్తుంది అమ్మ ప్రేమ 
ఒక్క రోజుతో తీర్చుకోగలమా మనం ? 

అనుక్షణం తపిస్తుంది అమ్మ మనసు 
ఒక్క మననంతో తీరుతుందా ఋణం ?

వీలయినంత ఎక్కువ తో సేవిద్దాం 
మరు జన్మకు సైతం అమ్మగా కోరుకుందాం. 

రైతు ఆత్మ హత్యలు - సవాళ్లు


రక రకాల రైతు ఆత్మ హత్యలు వింటుంటే 
రక్తము నీరవుతుంది ఎలాంటి  రాజుకైనా 
రాతి మనుసు కలిగిన దళారులకు, వ్యాపారులకు 
రాదు ఎందుకో రవ్వంత కనికరము . 

అప్పులిచ్చు ఆసాములు మొదలుకుని 
అరువుగా ఎరువులు,విత్తనాలిచ్చే వారి వరకు 
అవినీతి అధికారుల అమ్యామ్యాలతో 
(భూసార పరీక్ష, నీటి పారుదల , విద్యుత్, వ్యవసాయ మార్కెట్)
ఆఖరకు వ్యాపార బాంకులు సైతం. 

పట్టదెవరికి గిట్టు బాటు చేద్దాం రైతుకని 
పందికొక్కులవలె పిండి పిప్పి చేసి 
పట్టెడన్నం పెట్టె అపర అన్నపూర్ణ రైతన్నను 
పరాభవిస్తూనే పలాయనం చిత్తగిస్తూన్నారు  

అసలు సిసలు వరి, గోదుమ , జొన్నే  కాకుండా 
ఆరు తడులతో పూలు,పండ్లు, కూరగాయలు పండించే 
అరక దున్నే రైతన్నలను అదను చూసి కాటేయ 
అబగా కాచుకుంటున్నారు అంగడి దళారులు . 

ఆ పంటలకు తెచ్చే నకిలీ మందులు మాత్రం 
ఆత్మ హత్యలకేమో అవలీలగా పని చేసి 
ఆరుగాలం కష్టపడ్డ రైతన్నను మింగేసి 
ఆలు బిడ్డలను రోడ్డున కీడ్చుతున్నాయి

అప్పుల తిప్పలే కాకుండా ఆ కుటుంబాలలో 
ఆలనా పాలనా కరువయిన పిల్లలు 
అటకెక్కిన చదువు సంధ్యలతో 
అలితేరే ఆరోగ్యాల, ఆలోచనా సరళిలతో 
సవాలు విసరరా తిరిగి సంఘానికి  

పారా హుషార్.....  పౌరులకు, ప్రభుత్వాలకు 
పరామర్శించే స్వచ్చంద సేవా సంస్థలకు 
ప్రతీ వారు మేల్కొనాల్సిందే... అడుగేయాల్సిందే.... 
పాప పంకిలాన్ని పారద్రోలుటకు...... 

పెళ్లిళ్లు-సందళ్ళు-గోల


పండంటి జీవితాల పడుచుల జోడు కోసం 
పదహారు రోజుల ఉత్సవాలను  
పంచాంగ ముహుర్తములు పాటించుతూ 
పండగల లాగ నిర్వహించె ఆనాడు 

తదనంతరం ఐదు రోజులకు కుదించి 
తనువు బంధు బలగాల మధ్య 
తనివి దీర తమ ఉత్సవములు నెరిపి 
తాదాత్మ్యం పొందిరి మన తాతల కాలములో 

సంధి కాలముల సౌకర్యముగా ఎన్నుకుని 
చల్ల వాతావరణాల ఉల్ల సంతసమంద 
చైత్ర,వైశాఖ ,కార్తీక మరియు మాఘ మాసముల 
అతిథులందరికీ తగు ఆహ్లాదములు పంచ 

దగ్గరి బంధువులు , మిత్రులు సైతం 
దన్నుగా నిలిచి సాయమందించెను నాడు 
ధగ దగలు మెరువంగ నిగ నిగలు కురువంగ 
దర్పములు పెంచి సందళ్ళు-గోల అంటు
దండి ఖర్చులకు దిగుతున్నరు ఈనాడు 

వచ్చె పొయ్యెడి  బంధు మిత్రులకు వరుస బెట్టి 
వంట,వార్పులు, వసతులు రోజులెల్ల చేయలేక 
వాటముగా ముహుర్తములను సరిచేసుకుంటూ 
అభిజిత్ లను అలవోకగా ఆచరిస్తున్నారు

స్వామి కార్యములను సాకుగా చూపిస్తూ 
ఆచార వ్యవహార అవకాశములను 
అందిపుచ్చుకుని సంధి చేసుకుని 
సౌలభ్యముగా తమ తమ స్వకార్యములను 
సవరించుకొనుచుండిరి సావకాశముగ  ఈనాడు .

బాపూజీ బ్రతికించవా..... మరొక్కసారి

బాపూజీ బ్రతికించవా..... మరొక్కసారి

బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి 
జాతిపితవై  ఆలకించవా జనుల గోసను ఇంకొక్కసారి

విలువలు తెలియని కొంత మంది పాలకులతో విసిగిన ప్రజలు  
విచక్షణ లేని కొంత మంది అధికారులతో  విరక్తి నిండిన జనులు 
అవినీతి, బంధుప్రీతి,లంచగొండి తనాలతో  అట్టుడికి
అధః పాతాళానికి అంచున ఉన్నది విశ్వ వేదికలలో 

ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నయి  స్వాతంత్య్రం వచ్చి  
ఎగుడు దిగుడు లేదు సాధారణ ప్రజా జీవితాన   
ఎనభై శాతమున్న కర్షక,కార్మిక,జవాన్ల జీవితాన 
ఎలుగులు నిండుగా రాలేదు ఈనాటికి  

పనికొచ్చే విషయాలతో పాఠ్యఅంశాలుండవు 
పట్టు బట్టి ప్రజా అక్షరాస్యతను పతనం కావించారు 
గుడిని తలపించాల్సిన సర్కారు బడులన్నీ    
గుదిబండలుగా భారమై మారిపోతున్నాయి 

వినువీధులలో  ఫరిడవిల్లిన విశ్వవిద్యాలయాలు 
వింత వింత కారణాలతో కనుమరుగై  పోతున్నయి 
ప్రజారోగ్యాలకై వెలసిన ఆరోగ్యాలయాలేమో
పక్షవాతమొచ్చినట్టు పడకేసి పరిహాసిస్తున్నయి 

ప్రభుత్వాలు  మాత్రం సన్నాయి నొక్కులతో 
పన్నులు వేయడం,పద్దులు కేటాయించడం ఆనవాయితీ, 
ప్రజల బాగోగులు పట్టించుకోని పాలకులకు
ప్రవేటు అవుతుంది అక్షయపాత్రలు కొంత

విశ్వానికి విలువల మార్గాలు నేర్పిన దేశానికి 
విలువలేని జడపదార్థ మార్గం ముంచుకొస్తున్నది 
బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి 
జాతిపితవై  ఆలకించవా జనుల గోసను ఇంకోసారి 

Sunday, May 27, 2018

కన్నడ కమామీషు

కన్నడ కమామీషు

కన్నడ కంఠీరవాలన్నీ కఠిన చీకట్లలో 
కలుగులో దాక్కున్న కరిముఖుని వాహనం  తీరు 
కన్న పిల్లల్ని కాపాడుకున్న మార్జాలం  వైనమోలే 
కడుపులో కలియబెట్టి కెలికి తిప్పినట్టు .... కలగదా సామాన్యులకు సైతం 

ఉద్దండ నాయకులై ఉండి కూడా బేర సారాలతో 
ఉచ్చ రాజకీయములు పాటించిన మీ తీరు
ఉసి గోల్పదా ముందు ముందు అధికారులకు 
ఉసురు తీయ ప్రజలను మీ పాలనలో 

రొచ్చుగుంట రాజకీయమంటేనే అనే సంస్కృతి 
రోజుకో మలుపు తిరిగిన కన్నడ ప్రతినిధుల కమామీషు చూస్తే 
రాజుల రోజులే  మా బాగు మా బాగు అని  
బూజు పట్టిన విధానాలే మహా  మేలు అనుకోవాలేమో 

వాళ్లంటే వీళ్ళనీ,  వీళ్లంటే వాళ్ళని 
ఎన్నాళ్లీ ఊకదంపు కబుర్లు ....... 
న్యాయ వ్యవస్థ కూడా కలి నడకలకు  దాసోహం అయితే
నలుగురు మెచ్చే  ప్రజాస్వామ్యానికి దిక్కేది... దారేది ?

రాజ్యాంగాన్ని తిరగ రాయండి........... మీ దమ్ము చూపండి 
చట్టాలను మరింత  సాన బెట్టండి ...ధైర్యం తో అడుగేయండి 
స్వార్థాన్ని కొంత వదలండి.........కానీ మానవతను మరువకండి
నాగరికత తిరోగమనానికి  బాటలు వేయకండి... చరిత్ర హీనులుగా మిగిలిపోకండి.  




Sunday, May 20, 2018

తీపి జ్ఞాపకాలు

SK 624 
నగునూరి రాజన్న 

శీర్షిక: తీపి జ్ఞాపకాలు 

తనువు శాశ్వతం కాదని తెలిసినా.... 
తపన మానదు తన వారి గురించి ఆత్మ ... అయినా 
తప్పదు పోరాటం జీవిత చక్రములో 

పరమ పదము ప్రకృతి ధర్మమని తెలిసినా..... 
పడి లేచే కెరటం లా  పరితపిస్తుంది జీవి ... అయినా 
ప్రయత్నించి అడుగులేస్తాం జీవన యానంలో 

మరణం ఎప్పటికైనా తప్పదని తెలిసినా... 
మననం చేసుకుంటూంది మనసు....  పదే  పదే  
మనవాళ్ళ తీయని జ్ఞాపకాల దొంతరలను 

అనంతమైన తీయని బాధా భరిత ఆలోచనలకు 
ఆ క్రందనలతో ఆవిష్కరించుకుని, భాధలు పంచుకుంటేనే 
ఆర్తి తీరుతుంది, మనుసు కుదుటపడుతుంది 

మరుపు మానవ సహజం 
కాలం గాయాలను మాన్పుతుంది 
ఉన్నవాళ్లు పోయినోళ్ల తీపి గురుతులు .... 


Nagunuri Rajanna   Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
Karimnagar 

జగతికి మూలం

శీర్షిక: జగతికి మూలం 

జలమేరా  ఈ జగతికి మూలం 
జలం విలువ తెలిసికొనుట మానవ ధర్మం 

మూడింట రొండొంతుల జలమేరా విశ్వమందు 
ముచ్చటగా రెండవ ఆవశ్యం మానవ జీవనాన 

సద్వినియోగం చేసుకుంటేనే మనుగడరా 
సేద్యానికి, జీవనానికి యోగము జలము 

ఇనుమడింపు భూగర్భ జలాలను నిశ్చయమ్ముగా 
ఇంకుడు గుంతలు, కందకాలు,కాంట్లూరు,రాళ్ళ కట్టలతో 

కుంటలు, చెరువులు పూడికలు తీయించురా 
నిండు కుండలోలె సదా నీటితో నింపరా 

జలమేరా  ఈ జగతికి మూలం 
జలం విలువ తెలిసికొనుట మానవ ధర్మం 


Nagunuri Rajanna   Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
Karimnagar 
19.05.18

Thursday, May 10, 2018

తరం మారింది


తరం మారింది తలపులు మారుతున్నాయి 
మనమూ మారాలి వారి దారిలోకి 

అమ్మా, నాన్న, గురువుల మాటలకన్నా 
గూగులమ్మ మాట మీద గురి కుదిరింది 

అన్నా దమ్ములు అక్కా చెల్లెళ్ళ కన్నా 
ఆండ్రాయిడ్ ఫోన్లమీద మక్కువ పెరిగింది 

బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులకన్నా 
బంధమెక్కువైంది నెట్టింట్లో 

ప్రేమలు, పెన్నిధులు,అనురాగాల కన్నా 
ఫేస్ బుక్కులో వచ్చే లైకులంటే మక్కువ 

ఇరుగు పొరుగు వారి కన్నా 
ఇన్ స్టాగ్రామ్  పోస్టింగ్ లంటేనే  ప్రీతికరం 

ఎదుటి వారి గొప్పేంటి, ఎవరైతే నాకేంటి, 
నేనే రాజు , నేనే మంత్రి అనే రకం 

విజ్ఞాన సూచీలు అమాంతం మారిపోతున్నయి 
విశ్వవేదికలే హద్దులుగా విరబూయిస్తున్నారు 

ఇష్టమైన చదువులు/ఉద్యోగములు  ఎన్నుకుంటున్నారు 
కష్టములే తెలియకుండా పెరుగుతున్నరు 

ఆదాయాలకు మాత్రమే ప్రాధాన్యమంటారు 
విలువల వలలో చిక్కనంటారు 

ప్రతి చిన్న విజయానికి పొంగి పోతారు 
పక్క వాళ్ళ మెప్పులు  పొందాలనుకుంటారు 

పరుగులెత్తి  ప్రకంపనలు సృష్టిస్తున్న తరం 
పొదుపు ముందు తదుపరే ఖర్చు అంటున్న తరం 

పారిశ్రామిక విప్లవ కాలములోని  "మనం "
సాంకేతిక విప్లవంతో "నేను " గా మారిన తరం 

శాస్త్ర సాంకేతికత శకంలో పుట్టిన తరం 
విశ్వ సంస్కృతిని పట్టుకున్న తరం 
తక్షణ విజయాలను చవి చూడాలనే తరం 
తమ శక్తేమిటో నిరూపించుకుంటున్న తరం 

సామాజిక మాధ్యమాలల్లో సందడి చేస్తున్న తరం 
సంస్కృతి మార్చి, సాంప్రదాయములో మైలు రాయి నిలిపే తరం 

మిలీనియల్స్, స్క్రీనేజర్స్ , నెటిజన్స్ గా పేరొందిన తరం.
08-05-18

"విస్తరి " స్తున్న కాలుష్యం


అతిథి దేవోభవ  అన్న ఆర్యోక్తిని 
ఆచరించడమే మన ఆచారం, సాంప్రదాయం 
ఆరోగ్యానికి అత్యుత్తమం ఆకులో భోజనమని 
అందరికి తెలిసినా ఆచరించలేని దుస్థితి 

ఇంటికొచ్చిన అతిథి ఇలవేల్పు తో సమమని 
ఉన్న వాటిలోకెల్ల ఉత్కృష్టమైన వాటిని  
ఉడతా భక్తిగా సమర్పించి సంతుష్టులంజేయ 
యశోవృద్ధియని పచ్చి ఆకులో  "విస్తరి" వడ్డించేవారు. 

అవసరాలు పెరిగాయి లెక్కకు మించి 
అరణ్యాలు తగ్గాయి కారణాలనేకం 
ఆరోగ్యాల మాట అటుంచి అపాయాలు మూట గట్టి 
అందిస్తున్నాము అతిథులకు పాలిథీన్లలో ఈనాడు 

పండంటి జీవితాల కలయికలు (పెళ్లిళ్లు) మొదలు 
ప్రతీ చిన్నా, పెద్దా ఉత్సవాలలో 
పడగ విప్పి నాట్యం చేస్తుంది కరాళ నృత్యం 
పాలిథీన్ల వినియోగం పరాకాష్ట తో  కాలుష్యం

ఫలహారం, ఛాయలు, కాఫీలు నుండి 
పాయసాలు సహా పసందైన విందు భోజనాలు, 
పట్టెడు నీళ్లందించే మంచి నీళ్ల గ్లాసులు, ఐస్క్రీం కప్పులు 
ప్రతీది పాలిథీన్ల మయమే ఈనాడు 

పర్యావరణం పదిలమంటూ ప్రతీవారు గగ్గోలె 
పనితీరులో మాత్రం కనిపించనీయరు జనాలు  
ప్రభుత్వాలన్నీ బాకా భజాయింపులే  కానీ  
పట్టించుకునే పాలక పక్షమే కరువు. 

ప్రకృతి ఎంతో పవిత్రమైనదని 
పదే పదే ఋజువులు దాఖలా అయినా 
పట్టించుకోక పలాయనం చిత్తగిస్తూనే ఉన్నాం 
పవిత్రమైన "విస్తరి" భోజనం పద్ధతి కూడా 

పదే పదే వాడగలిగే పాత్రలే నయం 
పర్యావరణం , ప్రజారోగ్యం పదిలమౌతుంది 
ప్రజలు విజ్ఞతతో పాటించాలి ప్రత్యామ్నాయాలు 
ప్రభుత్వాలు చూపించాలి నూతన తరుణోపాయాలు.

అంతర్జాలం-భావితరం

మను సిద్ధాంతమో, మరో సిద్ధాంతమో 
పనులకనుకూలమనో, పాలనకనుకూలమనో ,
మతాలు,కులాలుగా ప్రాచుర్యం అయ్యాయి ఆనాడు 
పతనమయ్యాం వాటి వల్లనే అంటున్నారు కొందరు. 

మనం ఏం చేయాలనుకుంటున్నాం రేపటి తరాన్ని
మననం చేసుకుందామా మనకు మనం 
మనసు బెట్టి అందరం ఈనాడు 
మౌనంగా ఉండటం భావ్యం కాదేమో?   

నిశ్శబ్దం చేధిస్తే ఎదో సాధించొచ్చన్నది ఒకప్పటి మాట 
నిస్సంశయముగా ఇల్లు,సంఘం,దేశం సంస్కరించుకోవచ్చు. 
మాధ్యమాలు కొంత, అంతర్జాలం మరి కొంత 
వెరసి స్మార్ట్ ఫోన్లు యువకుల చెంత ....?

ఎంతో అభివృద్ధిని సాధించాం అని కదా మన  ధీమా.
ఎలా ఉండబోతుందా అయినా విశ్వ మానవ భవిత అని 
ఎక్కువ మంది మేధావులు మదన పడుతున్నారీనాడు 
ఎదో విధంగా కాపాడాలనే తాపత్రయం అందరిలో..... 
ఇంట్లో ఉండే వాళ్లంతా  టి వి సీరియల్స్ కు అంకితమౌతుంటే 
ఉద్యోగులు ఉదాసీనత తో సొల్లు రాజకీయాలకు అంకితమౌతుంటే 
కొంత మంది గురువులు కొలువేతర వ్యాపకాలకు అంకితమౌతుంటే 
నాయకులేమో నజరానాలు సర్దుకోవడానికి అంకితమౌతుంటే 
ఎంతో మంది రేపటి పౌరుల జీవితాలు గాలి వాటానికి అంకితమౌతున్నాయి . 

పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చి ఎలాగోలా నెట్టుకు రావాలని 
తంటాలు పడుతున్న ఛానెల్స్ ఎం సందేశమిస్తున్నాయి యువతకు ?
చడీ చప్పుడు కాకుండా చాప కింద నీరులా ప్రవహిస్తూ  అంతర్జాలం
వికృతాలకు ఆలవాలమైన నియంత్రణ లేని ఎన్నో సైట్లు.... 

యువతే మన దేశ భవిత, బలం అంటున్నాము కానీ 
యువత నడవడి పై నియంత్రణ ఎవరి పాత్ర, ఎవరి పరిధి? 
తల్లి తండ్రులు, గురువులు, నాయకులు అందరూ 
కాసుల వేటకిచ్చిన ధ్యాస,కన్న పిల్లల ఆలనా పాలనలకు ఇవ్వడం లేదు.

యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగ - కను సన్నల్లో పిల్లల్ని కాపాడుకోవాలి
యువత బాగుండాలంటే, కొంత కాఠిన్యం తప్పదు 
అమ్మా నాన్నలు, అధ్యాపకులు,ఆలోచన ఉన్నవాళ్లు 
అగ్ర పాలకులు, అధికారులు అందరు పాలు పంచుకోవాల్సిందే. 

అతిక్రమిస్తున్న యువత నేరాలను అరికట్టాలంటే 
అంతర్జాలంపై,మాధ్యమాలపై  అజమాయిషీ ఉండాల్సిందే   
అమలులో  జాప్యం లేకుండా అకుంఠిత దీక్షతో 
అందరం పాలు పంచుకోవాల్సిందే, ఫలాలు అందుకోవాల్సిందే. 

అవని

అవని తొలుత ఆవిర్భవించినప్పుడు

అచ్చంగా పచ్చ తోరణమోలె ఉండెనప్పుడు

జనం పెరిగి  యవుసమని , ఆవాసమని

జంగల్ నరికి అవసరాలు తీర్చుకుంటున్నరు
అందుకే కరువులు, కాటకాలు , నీటి ఎద్దడి

అటకెక్కుతున్నది రోజు రోజుకు పంట దిగుబడి

అడుగంటిన నీటి ఎద్దడితో ఆగమైతున్నరు  ప్రజానీకం

ఆగమైన ప్రజలు తరలిస్తున్నారు పశువులను  కబేళాలకు
పెద్ద మనసుతో మనమంతా మొక్క మొక్క నాటితే

పెరిగి పెద్ద వృక్షాలై- అవని  హరితమయమౌతుంది

భూగోళం వేడి తగ్గి వన్నె పెరుగుతుంది

సకాలములో వర్షాలు పడి సల్లగుంటం మనమంతా
వాగు, వంకలు,ఏర్లు, నదులు  పొర్లిపారితే

చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుతాయి

దండిగా నదులన్నీ నిండుగా పారితే

డాములన్నీ జల కళతో తాండవిస్తాయి
నీటి మట్టం పెరిగితే చేను, చెలక చేతికొస్తది

పాడి పంట పెరిగి పిల్లా, పాప పుష్టిగుంటరు

శుచి, శుభ్రతలు పాటిస్తూ, కాలుష్య భూతాన్ని తరిమి

సుఖ సంతోషాలతో మనమంతా జీవించవచ్చు
ఓజోనుకు జరిగే నష్టం అరికట్టవచ్చు

జీవరాశి వృద్ధి చెంది మనగలుగుతుంది

జన జీవనాలలో వన జీవుల వలసలు తగ్గుతాయి

ఘనమైన  జీవితాన్ని మనం అంది పుచ్చుకోవచ్చు

మే డే 2018



రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా 
రోజు కూలి బతుకులు మారలేదు 
ప్రజాస్వామ్యం పేరు చెప్పి పాలనలు వచ్చినా 
పేదవాడి బ్రతుకు చిత్రం మారలేదు 

మేడే పేరు చెప్పి పెద్దోళ్లంతా సందడి చేస్తే 
శ్రామికునికేమైనా సంతోషం దొరుకుతుందా?
దగాకోరు దలారీ తనం ఉన్నంత వరకు 
నిఖార్సయిన ప్రతిఫలం చేరుతుందా కాలే కడుపుకు?

స్వార్థ రాజకీయాలు,దళారీ వ్యవస్థ  మారితే , 
లంచగొండి అధికార హయాములు మారితే ,
కళ్ళ గంతలు తీసి న్యాయాన్ని సమం చేస్తే 
కనవచ్చును అసలు సిసలైన మేడే పండగ అందరి ఇంట 

తిలా పాపం తలా పిడికెడు-అందరిది



జగతికి మార్గదర్శకం చేయగలిగిన 
జాతి మనదని ఇంటా  బయట మారు మోగినా 
జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది, దాని 
జాడలు మాసి పోకుండా చూస్తుంది స్వార్థమనే పెను భూతం 

మన దేశంలో, మన ప్రజలకు, మన సిద్ధాంతాలతో 
మన నాయకులు ఎంతో మంచి సాధిస్తూనే ఉన్నారు కోకొల్లలు. 
విదేశాలు వదిలిన సిద్ధాంతాలతో  వితండ వాదులు  పన్నే కుట్రల్లో 
విచ్చు కత్తులకు బలి అవుతున్నారు కోయలు. 

అమాయకులైతేనే అడ్డగోలుగా ఆటలన్నీ సాగుతాయని 
అడివి బిడ్డలను అల్లుకుని ఆడుతున్నారు అందరు  నాటకాలు. 
కొంతమంది కలాలోళ్లు , కొంతమంది గళాలోళ్లు, కొంతమంది రాజకీయులు,
కొంతమంది అధికారులు, కొంతమంది మాధ్యమాలు, విప్లవ నాయకులు  

చాప కింది నీరులా, కంచే చేను మేసిన వైనంలా 
చట్టాలన్నీ చట్టుబండలవుతూనే ఉన్నాయి అక్కడ . 
స్వార్థమనే గుర్రాలపై స్వారీ చేస్తూ, రాచ పుండును  రంగరిస్తూ 
సమాజములో కుళ్ళును వేళ్ళూనేలా చేస్తూనే ఉన్నారు. 

అధికారంలో ఉన్నవాళ్లో, అప్పోజిషనలో ఉన్నవాళ్లో,
అంతరంగ సమావేశాలతో అవసరాలు చూసుకుంటూ 
అధికారుల(కొంత మంది) అండ దండలతో 
అంతా సంత చేసి వింత చూస్తూ  ఆనందిస్తున్నారు

అణగారిన ప్రజల అవస్థలను ఆసాంతం కనిపెట్టి
అసలు మూలాలు శోధించి అక్షర రూపం గావించి
అమరవీరుల కుటుంబాలను  ఆదుకున్న చందంగా
ఆద్యంతం  నిర్మూలనకై ఆలంబనగా నిలవండి. 

అరువదేండ్ల స్వాతంత్య్రం  గడిచినా 
అణగారిన మారుమూల అడవి  పల్లెల్లో 
అణుమాత్రం విధానాలు మారడం లేదంటే 
అతిశయోక్తి కాదేమో స్వాతంత్ర భారతాన 

అందుకు అందరం బాధ్యత వహించాల్సిందే 

లేదంటే 
స్వార్థం వీడిన నాయకులు దొరికి 
సేవలు తెలిసిన అధికారులు కుదిరి 
విలువలు తెలిసిన మనుష్యులు కలిసి 
విజ్ఞతతో సాధించవచ్చు వెలుగులు వారి జీవితాన