ఇష్ట కవిత
తేది: 11-04-2021
శీర్షిక: నిన్ను నీవు తెలుసుకో....
కవిత సంఖ్య : 007
నీకు నీవు ముచ్చటించుకో
నిజం నిలకడగా తెలుసుకో....
ప్రాణులన్నింటిలోన ప్రముఖున్నంటావు
పక్కవాణ్ణి పలకరించే తీరిక లేదాయె ....
మేధో సంపత్తిలో గొప్ప మేటి నంటావు
ఆత్మీయతలను మరిచి అలమటిస్తున్నావు..
నాగరికతలు నేర్చానంటావు
నలుగురితో కలిసి బతకలేవు
భాషలెన్నో కనుగొన్న నంటావు
భావాలు మరిచి బతికేస్తున్నావు ...
పరిశ్రమలు కనుగొన్న పసందులోన
పల్లె దాటి ఇల్లు దాటి పయనమై
పరుగు లంఘించుకుంటివి ...
సాంకేతికతల సొబగులద్దుకుని
సముద్రాలు దాటి...తీరుబడి మరిచితివి .....
ఎంత ఎంతని వెతుకులాటేనాయే
ఆశల పందిరి నిలువనీయదాయె
అక్షర లక్షలు కోట్లు సంపాదించినా
మనిషి లక్షణాలు మరిచిపోతుంటివి ....
శరీరం అలిసి తూలితే
మెదడు మత్తుతో మొద్దుబారితే
నీతి నియమం మరిచిపోతే
నియంత్రించేది నీ ఆశలే సుమా ....
ఉరుకుల పరుగుల జీవితాన
సుఖాలు మరిచిన మేనుకు
ప్రశాంతతలు నిండిన కునుకేది
సప్తవర్ణాల సందడి చేసే కలలేవి ?
వెనక్కి తిరిగి చూసుకుంటే
జీవితం ఓ అందమైన లోయలో
కనుచూపు మేర కానరాని
ప్రపంచం...కానరాని నీ వాళ్ళు ....
ఎందుకు పరిగెత్తుతున్నావో
ఏం సాధిద్దామనుకున్నావో
నీకు నువ్వే ముచ్చటించుకో
నిజం తెలుసుకుని నిర్దారించుకో ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment