ఏదీ నీ చిరునామా ?
తేది: 16-04-2021
శీర్షిక : సత్యం ధర్మం న్యాయం
కవిత సంఖ్య: 641
హరిశ్చంద్రున్ని అత్యున్నతంగా
ధర్మరాజును ప్రతినిధిగా
గాంధీజీని ఆచరునిగా
పేరుప్రఖ్యాతులు పెన్నిధైనా
కంటికి కానరాని నల్లపూసాయే...
నిఖార్సయిన సత్యం....
కృతములో నాలుగుగా నడయాడి
త్రేతములో ముచ్చటగా మూడయి
ద్వాపరంలో రెండుగా మారినా
కలియుగములో ఒకటన్నారు
అయినా కానరాకుండున్నది....
సమానమయిన ధర్మం....
అంచెలంచెల విభజనలతో
వాయిదాల పర్వాలతో
వాయనాల ధరవరలతో
అద్దాల మేడలలో అందరికి సుదూరంగా
అందకుండా దోబూచులాడుతున్నది ....
అచంచలమైన న్యాయం....
యుగాలు మారినా జగాన నేడు
రాజ్యాలు మారి ప్రజాస్వామ్యములైనా
ప్రజలతో దాగుడుమూతలే ....
బలమున్నోడికో.. బలగమున్నొడికో ..
ధనమున్నోడికో.. భాగ్యవంతులకో..
అధికారమున్నోడికో..ఆలంబనలు
ఉన్నవారికో తప్ప...ఆనవాలు కానరాని
సత్యం ధర్మం న్యాయం చిరునామాలు ...
సగటు మానవునికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment