నేనే శూన్యమైతే
తేది : 22-10-2021
కవిత సంఖ్య : 180
శీర్షిక : మానవత్వపు అడుగులవైపు ....
ఉషారెక్కించే ఉషోదయాలు
కిర్రెక్కించే పక్షుల కిలకిలా రవాలు
పరవళ్లతో ప్రవహించే సెలయేళ్ళు
ఆహ్లాదాలు పంచే ఆనందక్షణాలు ....
చుట్టూరా పరుచుకున్న చెట్టు చేమా ...
కేకకు ప్రతి కేక పంపించే కొండా కోనా
పచ్చని పైరునుండి వచ్చే పైరగాలి
మనసును తేలికపరిచే ప్రకృతి అందాలు .....
ఆత్మీయతలు పంచే ఉమ్మడికుటుంబాలు
అనురాగాలు పంచే తోబుట్టువులు
ఆనందాలు పెంచే మిత్రబృందం ....
ఒకప్పటి మాటై ... ఒంటరి జీవితాల పోరాటం ....
ఈనాడు ....
కలి మాయల ప్రపంచంలో కబాడీ ఆట అని
ధర్మం ఒక్క పాదమే అంటే ఏమిటో అనుకున్నా .....
కాలుష్యాల రణగొణ ధ్వనులతో చిరాకు పరాకులు ...
కలుషితాల మునిగిపోతున్నకొండా కోనా వాగులే కాదు
నిత్య జీవన సరుకులు రహదారులు కూడా ....
జీవరాశిలో మేటినని విర్రవీగే మనిషి
మానవత్వాలు మరిచిపోతున్న వైనం
కసాయి తనాలను పెంచి పోషిస్తున్న
కబోది మత తత్వం ....
మోసాలనే పాఠాలుగా బోధిస్తున్న
ప్రాంతీయత్వం .....
పెద్దమనుషుల్లా చలామణి అవుతూ
కారణం లేకుండా కండువాలు మార్చే
కర్కోటకత్వం ....
స్వార్థాలకు మాత్రమే పెద్దపీటలు
వేసే రాజకీయ తంత్రం ....
ప్రజాక్షేమాలను గాలికొదిలి
పరాచికాలాడుతున్న అధికార గణం ....
అభివృద్ధికి సూచికలనుకున్న పారిశ్రామికత
సాంకేతికతలతోనే సడేమియాల్లాంటి
కొంతమంది సైబర్ నేరగాళ్లతో ....
నిండిపోతున్న నిత్య జీవితం....
మనసంతా మలినాలతో నిండి
ఆలోచనలన్నీ అచేతనమై
స్పందనలే కరువైన బరువెక్కిన
గుండె ... మొరాయించి శూన్యమౌతుంటే .....
విషవలయాలన్నీ విశృంఖలమౌతుంటే
వినమ్రంగా కోరేదొక్కటే ...
వేణువును తొలిచిన వేదన గాయామైనా
తిరిగి మధురమైన గానమై రవళించాలి
ఛేదించాలి విజ్ఞులు చేతనైన విధంగా
నినదించాలి విజయకేతనం ... కదిలించి
మళ్ళీ మానవాళిని మానవత్వపు అడుగులవైపు ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment