తొందరపడి కూసేవు
తేది : 08-10-2021
శీర్షిక : నేటి తరం నాయకులు
కవిత సంఖ్య : 773
అనుభవాల అడుగుల్లో తచ్చాడాలి
పరిమళాల తోటల్లో అద్దుకోవాలి
అరమరికలు వదిలి నేర్చుకోవాలి
పరిపక్వతల పండ్లు తినాలి ....
అన్నీ నేర్చుకున్నాకే అడుగులేయాలి
తప్పటడుగులకు తావు లేకుండా ....
ముక్కు పలిగి బొక్క బోర్లా పడకుండా ....
అప్పుడు గాని అంకం మొదలు కాదు .....
సందు బొందుల్లోని సాదా మనుషులైతే
పెద్దగా పట్టించుకోనక్కర లేదేమో ....కానీ
ఒక్కసారి ప్రజా మనసుల్లో పదిలమయ్యాక
నోరదుపుల పెట్టుకుంటేనే నప్పుతుంది ...
మైకులు దొరగ్గానే మైకమొచ్చినట్టు మాట్లాడి
వాస్తవాల వనములోకొచ్చాక బడ్జెట్ బాగోతం
చెంప చెల్లుమనిపిస్తేగాని తేరుకోనట్టయితే ...
ఎలా....పుటలు తెరిచి ప్రచారమాధ్యమాలు
పొల్లు పోకుండా వల్లె వేస్తాయి ......
కాని .... నేటి నాయకులు తొందరపడి
కూసేసి... కండువాలు మార్చుకున్నంత
తేలిగ్గా ... మాటలు మార్చేస్తూ పాల కంకుల
మనసున్న ప్రజలకు కుచ్చు టోపీలు పెట్టేస్తూ
ఎదురు వాదనలకు దిగుతున్నారు .... ఏకంగా
అధికార దాహాల దప్పికలు తీర్చుకుంటూ
రాజరికాల వాసనలు రంజింపజేస్తున్నారు .....
తొందరపడి కూసే కూతలకు పడిపోకుండా
పారా హుషారై ప్రజలంతా ఎన్నికలకు ముందే
ఎదురు ప్రశ్నించడం నేర్చుకోవాలి... కాదంటే
బతుకులు కనుమరుగయ్యే చిత్రమే ఇక .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment