తేది: 02-04-2021
చిత్రకవిత
చిట్టి నేస్తాలు...
అల్లంత దూరాన గ్రీష్మం
ఆవరించిందో లేదో గాని
ఆపసోపాలతో ఎండవేడి
అడుగు పడనే పడింది .....
మనిషొక్కనికే కాదు పశు
పక్ష్యాదులకు గడ్డు కాలమే
తిండి తిప్పళ్లకే కాదు దప్పిక
కూడా తీరక తల్లడం మళ్లడం ...
చలువ పందిళ్లు కాశే గుడిశెలు
కాలమహిమలో కాటగలిసి
మట్టి గూనల పెంకుటిల్లులు
మచ్చుకైనా కంటికి కానరాక....
కాంక్రీటు వనాలు పెరిగి పోయి
కరంటు స్తంభాలు విస్తరించి
ధ్వని తరంగాల బందీలతో చావు
తప్పి కన్ను లొట్టలా ప్రకృతి వేడికి
పదింతల తోడుగా ఆజ్యం పోస్తూ ....
పని రాక్షసులై పట్టింపు లేని వైనం
పట్టుమని పది నిమిషాలైనా
పరోపకారం ఆలోచిద్దాం ...
మానవత్వాన్ని తట్టి లేపుదాం ...
చిట్టి జీవులకు ప్రాణసంకటమైన
దూప గోస తీర్చంగా ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment