Friday, November 5, 2021

వృద్ధులతో కాసేపు తేది : 01-10-2021 శీర్షిక : మాట కలిపితే చాలు

 వృద్ధులతో కాసేపు

తేది : 01-10-2021
శీర్షిక : మాట కలిపితే చాలు 
కవిత సంఖ్య : 767

నాగరికతల నడకలలో మనిషి 
ఉరుకులు పరుగులు మొదలయ్యాక ... 
అలవాట్లన్నీ తడబడుతూ....ఒకటొకటిగా 
మరిచిపోవడమే ఒంటబట్టింది .... 

పాశ్చాత్య మోజులో పడిపోయాక 
పారిశ్రామిక నీలి నీడలలో 
శ్వాసలు కూడా తీసుకోలేక 
పరుగులు పెడుతున్నాము పైసల వెనుక ..... 

అవిభాజ్య కుటుంబాల ఆనందాలు 
విరబోసుకున్న రోజులలో అయితే 
అనుభవాల తోటలలో విరబూసిన పూలు 
కాయలు పండ్లు సద్వినియోగమయ్యేవి .... 

వృద్దులు అక్షర జ్ఞానాలు లేని నిరక్షరాస్యులు 
అనుకోకుండా ....మాట కదిపితే చాలు 
జీవిత చదరంగపు అడుగుల్లో ముళ్ళు 
గుచ్చుకోకుండా నీవెలా నడుచుకోవాలో 
ఇంటి అరుగులమీద ముచ్చట్లాడుతాయి.... 

శరరీం ముడుతలతో అందవిహీనం 
అయిందని అనుకోవద్దు .... ప్రతి ముడుతలో  
ఓ జీవిత మలుపుకు సరిపడా ముడుపు కట్టుకుని 
విక్రమార్కుని కథలెన్నో విప్పుతాయి ..... 

బాగులనిండా డబ్బులు కాదు... వాళ్లకి ... 
బాగున్నావా అనే ఒక్క మాట చాలు .... 
ఆడంబరాలు కాదు వాళ్ళు  కోరుకునేది ... 
అరమరికలు లేని నీ అండదండలు ..... 

మూటలవసరం లేదు వాళ్లకి ..... 
గుప్పెడంత ప్రేమతో గుండెలు నింపుకుని .... 
మాట కలిపగలిగి  మనసు విప్పితే చాలు .... 
కోటల సుమాలై తోటంతా విరబూస్తాయి ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment