అక్షరయానం
తేది : 08-09-2022
శీర్షిక : సంస్కారవంతమైన పయనం
కవిత సంఖ్య : 981
సంఘజీవనానికి సంకేతమై
సంస్కారాలను సంతరించుకుని
ప్రత్యేకతలను పదిలపరుచుకుంటూ
ఆత్మగౌరవానికి తొలి మెట్టయింది…
క్షరము లేనిదై తరాల వారధిగ నిలిచి
తన్మయత్వాల తనివి దీరా హత్తుకుని
యుగాలుగా పయనించి పరితపనలతో
భారత భాగవత రామాయణాలనందించె ...
ఉత్తుంగ తరంగ వేద వేదాంగాలను
ఉత్కృష్టమైన ఉపనిషత్తులను
కడు రమ్యమైన ఎన్నో కావ్యాలను
బ్రతుకు నిర్వచనాల భగవద్గీతనిచ్చి
అత్యంత పురాతన ఆధారభూతాలతో
విశ్వవేదికలపై పెద్దన్నను చేసింది
మన హైందవాన్ని.....
మనిషికి మాటల ప్రాణవాయువై
పల్లెకు పట్టణాలకు దారులేర్పరిచి
దేశాలకు మధ్య రాయబారాలతో
ప్రపంచాన ప్రత్యేక గుర్తింపయింది...
సమతలెరుగని స్వార్థాలు పెరిగి నప్పుడు
సమపాళ్ళల్లో సంపదలు తప్పినప్పుడు
కనీస బ్రతుకులు కాలిపోతున్నప్పుడు
ప్రశ్నించే గొంతుకలై పల్లవిస్తుంది ....
అధికారాదాహాల కింద అణిచివేతలకు
అహంకారాల కింద నలిగిన జీవితాలకు
రక్షణలు కరువై హాహాకారములైనపుడు …
నిప్పుల వర్షం కురిపించే ఆగ్నేయాస్త్రమే ...
రాతి గుహల చీకటి జీవితాలనుండి
రంగు రంగుల భవంతుల వైపు నడిపించి
హంగులన్నీ సమకూర్చుకుంటూ
చంద్రయానానికి సైతం సమాయత్తమౌతున్నది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment