చిత్ర కవిత 21
తేదీ : 16-08-2021'
శీర్షిక : ఎర్ర బస్సు కర్చీఫ్ లు ....
కవిత సంఖ్య : 730
ప్రజల ద్వారా ప్రజలకోసం
ప్రజల ప్రభుత్వమంటూనే
ప్రయాణం మొదలెట్టిన
ప్రజాస్వామ్య పాలనలు ....
పరిహాసాల చిరునామాలే….
చాలామంది ధవళ వస్త్రాల పాలక దూతలు
అతి వినయాలను అవపోషణ పట్టి…
కల్లబొల్లి కపట వినయాలను కరతామలకంగా
పాటించే ఘనాపాటీల ఉద్దండులే…
గొప్పోళ్ళ గోత్రాలన్నీ ఉటంకిస్తూ
పుటం పెట్టిన బంగారమోలే
మాటల మైకులను చెవుల్లో రొదలు
చేయిస్తూ….సభలు ...సమావేశాలు…
రోడ్ షోలు సర్వసాధారణం ....
లంచగొండి ఉద్యోగుల భరతం
పడతామంటూనే... ప్రగల్భాలు పలికే
నాయకులంత… పరిహాసాల చిట్టాలే…
గురువింద గింజలా ... తమను
తామే మరిచిపోయినట్టు నటిస్తూ ....
నోట్లిచ్చి ఓట్లు కొనుక్కునే ....దళారీ
వ్యవస్థలకు తెరలు తీస్తారు...కాదంటే....
కుల మతాల ప్రాతిపదికలో ...
ప్రాంతీయ చిచ్చుల పాచికలో
పనికి రాని పసలేని ఉచిత పథకాలో
తెర మీద బొమ్మలై ఆడుతాయి ....
పానకాల స్వాములకు అభిషేకాలు ....
స్వార్థపూరిత సన్నిహితులతో
పచ్చనోట్ల కుచ్చు టోపీలు .... నిత్య
సత్య వ్రతాలై నోచుకుంటాయి ....
సాంకేతికతలతో ఈవీఎంలొచ్చినా
సడేమియాల్లాంటి రిగ్గింగులు ...
మొత్తానికి కుర్చీ లాటలో .....ఇంకా
ఎర్ర బస్సులో కర్చీఫ్ ల చందమే…..
అవినీతి ఓటు ముందా ....
ఆ ఓటుతో గెలిచిన నాయకుని
దుర్నీతి పాలన ముందా ..... అంటే
అవినీతి ఓటే ముందంటా....నేను ...
కలసికట్టుగ ఓటర్లంతా నీతి పాటిస్తే
కొట్టుక పోదా గంగలో అవినీతి అంతటా…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment