కణిక -
కళ్ళను మనసు చేసుకుని
18-11-2022
అయ్యా !
సత్యహరిశ్చంద్రుని కథలు చదివి
కదిలిపోయిన మీ గుండె
సత్యమునే అనుసంధానించినది ...
అహింసను ఆయుధంగా చేసుకుని
మహా మహులు పూనుకున్నా
ఒకటి చేయలేని దేశ ప్రజానీకాన్ని
ఒక తాటిమీద నిలుపగలిగావు ..
ఉప్పు సత్యాగ్రహంతో ఉప్పెనలాంటి
ఊపు తీసుకొచ్చావు.. స్వదేశీ వస్తు
వినిమయమంటూ జబర్దస్తుగా
పోరాడావు .. నెత్తురోడాకుండానే
తెల్లోని మత్తు దించి దేశ్య దాస్య
శృంఖలాలను తెగనరికి స్వాతంత్య్ర
భారతాన్ని సముపార్జించారు . మీ
కెప్పుడు మేమంతా రుణపడి ఉంటాము.
వింతలు నిండిన మీ చరిత చదివి
విశ్వమంతా కీర్తిస్తున్నది.. మీ జీవన
యానమునే పాఠాలుగా ప్రస్తుతిస్తూ
యువతను తీర్చి దిద్దుతున్నది .
భవితంతా మీ మార్గదర్శనమేనని
ఢంకా భజాయించి చెబుతున్నారు ...
ప్రత్యక్షంగా చెప్పకనే పరోక్షమై
ప్రభోదిస్తూ అనేక విషయాలలో
మీ మాట సదా నెగ్గించుకున్నారు .
చొరవ చూపించాల్సిన కొన్ని
విషయాలలో మౌనంగా మిన్నకుండిపోయి
కొన్నిసార్లు మన వారి ప్రాణాలను
ఫణంగా ఎందుకు పెట్టారు .
ప్రజాతంత్రమంటూనే పదిహేను
పరగణాలలో అత్యధిక మన్నన
పొందిన వారిని పక్కన పెట్టి
మీరు మలినమెందుకు మూట
కట్టుకున్నారు. చరిత్రలో మీ మీద
మచ్చ పడుతుంటే తట్టుకోలేక
సతమతమౌతున్నాం ...
ఖలునకు నిలువెల్లా విషంలా
మొగిలిపూల వనంలో కాలనాగులా
తరాల ముందు కాలమునాడే తలకెత్తుకున్న
గాంధారపు కాందిశీకుల కౌశలము .....
మితవాదులగ ముద్రలు వేసుకుని
అహింసా వాదులతో అంటకాగి
అంతర్గత మంతనాలతో ... అసలు
అంకె అచ్చు పడని చెల్లని నోటుతో
నోముకున్నోడి ఫలం నోచుకున్నోడి
వంతులా...తన్నులాటలో తస్కరణలు
జరిగిపోతుంటే నిలువరించలేదెందుకు .....
మహాత్మా ! మళ్ళీ జన్మించవా
యువతకు భవిత చూపగా
నాయకులకు పాలనాలు నేర్పగా
ప్రత్యక్ష బోధనలు పంచగా ....
ఇట్లు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment