సాన్నిహిత్యం
తేది: 29-01-2022
శీర్షిక: కాలం మీద కక్ష్య….
కవిత సంఖ్య:
ప్రకృతితో మమేకమైన మనిషి
ప్రకృతి పరమైన ప్రేమలు అనురాగాలు
ఆత్మీయతలు ఆప్యాయతల్లో
మునిగితేలుతూ మురిసిపోయేవాడు…
ఒకప్పుడు….
చెట్లతో పుట్టలతో కాలం గడిపి
ప్రశాంతంగా ఉంటూనే…. ఆలోచించి
నాగరికతల వీదుల్లో అడుగులేస్తూ..
పక్షిలా పయనించాలనుకున్నాడు
మీనంలా ఈదాలనుకున్నాడు ...
నడకలో వేగం పెంచి..సరిపోక
పరుగు లంఘిస్తున్నాడు ....
కాలాన్ని ఓడించాలనే కక్ష్య
మొదలైన మానవునికి
కంటి మీద కునుకు కరువైయ్యింది…..
పారిశ్రామికీకరణలతో పరేషాన్ అవుతూనే
సాంకేతికతల నీడలో సవాళ్లతో సావాసం చేస్తూనే
సూక్ష్మీకరణలతో ప్రళయాలు సృష్టిస్తూనే...
ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతోనే అవిరళమై...
యాంత్రికతలు సంతరించుకున్నాడు ....
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
సాటి మనుషులతో ప్రయాణించాల్సిన
తాను ముందుండాలనే ఆరాటంలో
తన చిరునామాను పారేసుకుని
ఒంటరివాడయ్యాడు...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment