పల్లవించావా నా గొంతులో ...
తేది: 17-03-2022
శీర్షిక : ఆనతీయవే హంసవాహిని
కవిత సంఖ్య : 870
పల్లవించవా పద మంజీరమై
పలుకుల బంగారమై నా గొంతులో ...
శిశిరం విడిచిన వసంతమై
చివురాకుల కొమ్మల్లో కోయిలవై .....
పల్లవి చరణం సర్వం నీవై
రాగం తాళంల పట్టింపు లేని
గాన గంధర్వమయ్యే జానపదమై
రస రాగాలను పలికించవా .....
సంద్రపు అలలను తలపిస్తూ
సెలయేటి గమకాలను ఆలపిస్తూ
పిల్ల తెమ్మెరల జాడలతో
పండు వెన్నెల మాధుర్యాలను .....
ఆత్మీయతలు వెదజల్లిన
అమ్మ ఒడిలోని లాలనలను ...
అనురాగాలు పండించిన
బంగారు బాల్యపు ఆనవాళ్లను ....
సుమ పరిమళాల సుందరాలను
నవ మన్మథ లీలల భావాలను
అలవోకగా పలికించే పదమైనా
ఆనతీయవే అమ్మా హంస వాహిణీ ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment