పాలనల మచ్చుతునక
పబ్బతి పట్టి పాలించండయా
అని పగ్గాలు చేతికందిస్తే….
స్వార్థ చింతనల పరపతుల కోసమని
సంకుచితంగా పరాచికాలాడుతున్నారు ...
స్వలాభాలో...స్వార్థాల సంచులో
లొసుగులో లోపాయికారితనాలో
అంధులై… చీకటి ఒప్పందాలతో
ప్రజలను పజీత చేస్తున్నరు ...
పాలకులే మీరై… ప్రభుత్వాల
ధర్నాలా… ప్రతిపక్షాలైతైనేమో
పదినిమిషాల్లోఅరెస్టులు…రాజ్యమా
భోజ్యమా…నీ మనసుకే వదుల్తా…
పాలకులకు పట్టకుంటే… అందలాలెక్కిన
అధికారులన్న ఆలోచించాలి కదా…
నాలుగంచెల నజరానాలంటూ మన
రాజ్యాంగం రాసుకున్న దాఖలాలేవి…
బట్ట కాల్చి మీదేయడమా…బతుకు
పాశ్చాత్యాలకు పాకులాడే మీరంతా …
బహిరంగ చర్చతో కడిగిన ముత్యమైపోండి
ప్రజలను పదిలంగా చైతన్య పరచి…
న్యాయం ధర్మాలకు మీరే నాందీ పలకండి…
నడిచొస్తారుకదా నవ తెలంగాణం మీవెంట….
అందమైన అసెంబ్లీలు
పవిత్రమైన పార్లమెంటులు
సమ్మతమైన సచివాలయాలు
న్యాయమైన కోర్టులెన్నో అందుబాటు మీకు…
ధర్నాల పేరుతో దగాలు చేస్తూ
దారులుకాచి అటకాయిస్తూ…
చంటిపిల్లల ఉసుర్లు పోసుకుంటారా…
ఎండపూట నిండు గర్భిణీలను
అంబులెన్సుల్లో అటకాయిస్తూ…
మీ తల్లుల పెంపకాలేనా మితిమీరిన
దాష్టీకాలకు మిగుల బలమిచ్చింది….
అధికారం ఇచ్చినంత మాత్రాన
అమానవీయతలు ప్రదర్శించాలా ..
మానవత్వ పరిమళాలతో కూడా
మన బలాలను ప్రదర్శించుకోవచ్చు ...
ఎంతో ఎత్తుకు ఎదిగినట్టే ఎదిగి
దిగజారితే ...చరిత్ర క్షమిస్తుందా ...
సామాన్యులు పట్టించుకోకపోవచ్చు
విజ్ఞులు వినయానికి మౌనం దాల్చవచ్చు…
ఆత్మసాక్షికి సమాధాన మివ్వలేకపోతే
ఆ పరమాత్ముడు కనిపెడతాడు సదా...
ప్రజల పెడబొబ్బల శాపనార్థాలే తదాస్తు
దేవతల పలుకులై పోగలవు…తస్మాత్ జాగ్రత్త…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment