మారని మనిషి
తేది: 16-06-22
శీర్షిక : ప్రకృతి బోధించినా
కవిత సంఖ్య : 137+6
వన్యమృగాల బారినుండి రక్షించుకున్న
రాతి గుహలలోని నియాండర్తల్ లైనా
మేకవన్నె పులులున్న మేలురకం నాగరికతల
జాడలలో నడయాడే మనుషులైనా..మార్పు లేదు…
యుగాలు దాటి కాలం మారిన పాలనలోలైనా
పేర్లుమారి పెద్దరికం చలాయిస్తున్న స్వార్థ
మూకలనుండైనా … మనిషి తనను తాను
రక్షించుకోవడానికే జీవితమంతా సరిపోతుంది…
గాలి మోటరులో గంధర్వ లోకమెల్లగలడు
శూన్యంలో బాణంలా దూసుకుపోగలడు
పాలపుంతలోని గ్రహాలకు వెల్లగలడు…
కానీ.. స్వార్థాల సరంగులను జయించలేడు…
సప్త సముద్రాలను అలవోకగా ఈదగలడు
మంచు పర్వతాలను మదించగలడు..
అవసరమైతే ఆత్మీయతలను అందించగలడు…
అలా అని… ఈర్ష్య అసూయలను దాటలేడు…
అత్యవసరాలను అధిగమించినా
అవసరాలను అందిపుచ్చుకున్నా
వింతగ విలాసాలను విడువలేడు…
విచ్చిన్నాలకు కూడా వెనుకాడడు…
కలుషితాలు కాలు దువ్వుతున్నాయన్నా…
కబళించడానికి కదం తొక్కుతున్నాయన్నా…
మన్ను తిన్న పాములా పడుకున్నాడు..
అలసత్వాల నీడలలో తచ్చాడుతూ….
ప్రకృతి గురువుగా పలు విషయాలు
బోధించినా... పట్టనట్టు వ్యవహరిస్తూ
పక్కవారిని పలు రకాల హింసిస్తూ
పశు ఆనందాలను పొందేందుకే ...
మొగ్గు చూపుతున్నాడు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment