:గాయం
తేది : 08-02-2022
శీర్షిక : నొప్పి
కవిత సంఖ్య : 214
జీవరాశిలో మిన్నంటూ విర్రవీగే ...
మనిషి చరిత్రంతా ఎందుకో ....
గాయాలతోనే రక్తసిక్తమైంది ...
మరకలతోనే నిండి పోయింది ...
భూపాల రాగంలో రసరమ్యమై
పక్షుల కిల కిలా రవాలతో
ఆనంద కీర్తనం ఎత్తుకోవాల్సిన
తరుణం ... మాటి మాటికీ మలిన
ఛాయలతో మకిలి పడుతున్నది .....
కాల చక్రంలో కదిలిపోయిన
అడుగుజాడలన్నీ...అనుక్షణం
అనుభవాల తోటలో... బోధనల
చిలకపలుకులు కోరి చెబుతున్నా...
మనిషి పదే పదే చెవిటివాడుగా
మారుతూనే ఉన్నాడు ....
విజ్ఞానాలకు వివేకం తోడై
సాటి మనిషి కూడా సమానమనే
ఆలోచనలు నింపుకోవాలి ....
స్వార్థాలు తలకెక్కి నర్తిస్తే ...
సమాజమంతా బానిసై తోస్తుంది ....
మద మాత్సర్యాల మత్తులో
నిండా మునిగి ఊగి తూగితే ...
ఎదుటివారిని నొప్పించే
రాక్షసత్వం విశృంఖలమై
రావణ కాష్టాలే మిగులుతాయి ....
నొప్పి విలువ అనుభవిస్తేనే …
మనిషి మారగలుగుతాడు…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment