చిత్ర కవిత
తేది : 02-08-2024
శీర్షిక : అప్రమత్తత
పశు పక్ష్యాదులపైన
సాధించిన పెత్తనములా
ప్రకృతి పైనా సాధించాలనే
తాపత్రయం మానవునిలో ...
ఆశల ఆశయాలైన ఆనకట్టలతో
నీటిని సద్వినియోగం చేసుకోవడమే
కాకుండా అత్యాశల పేరాశల
ఊశయ్యగా మారిపోయి గుడిని
గుడిలో లింగాన్ని మింగేసినట్టుగా
చెట్లను గుట్టలను వాగులను వంకలను
వరస బెట్టి మింగేస్తూ ... చెరువులను
చెరబట్టి ... నాళాలను కూలగొట్టి
వామనునిలా అంతా నేనే వ్యాపిస్తా
అంటూ నిస్సిగ్గుగా మసులుకుంటుంటే ....
బంధు మిత్రులని పక్షపాతం
చూపించే నాయకుల్లా కాకుండా ...
నిష్పక్షపాతమైన ప్రకృతి ప్రవాహం
నీరాజనాలను ఇస్తూ అడ్డమొచ్చిన
అన్నింటిని... మనుషులను
వాహనాలను తనలోనే
కలుపుకుంటూ సాగుతున్నది..
నీటి ప్రవాహానికి ఎదురీదుదామని
అంచనాలేని ఆరాటంతో
దాటిపోదామని తాపత్రయపడితే నీటి
ధాటి పోనీయనని నిఘా పెట్టింది..
అప్రమత్తతల విజ్ఞానం మాత్రమే
అండదండలనిచ్చు... అలక్ష్యం
ఖరీదు ఓ నిండు ప్రాణం ...
అనుభవాల నీడలలో అడుగేయడం
ఎంతైనా ఆమోదమే .. ప్రమోదమే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment