వెండి జాబిల్లి సాక్షిగా
తేది: 15-07-2021శీర్షిక : పండు వెన్నెలలు ....
కవిత సంఖ్య: 708
శిశిరంలో తలలు వాల్చిన తరువులా
కృష్ణ పక్షములో క్రమంగా క్షీణించినా
వసంతంలో వనమంతా చిగిర్చినట్టు
శుక్ల పక్షంలో దినదినాభి వృద్ధితో
నిండు పౌర్ణమి అందాలను ఆరబోసుకుని
పండు వెన్నెలలను విశ్వమంతా పంచుతుంది .....
వెండి జాబిల్లి .....
స్వయం ప్రకాశితుడు కాలేకపోయినా
గ్రీష్మ తాపాలను తాను భరిస్తూనే
వరుసకు మనకు మామయ్యయినా
వంతుకు మాత్రం తల్లిలా ఎప్పుడూ
అమృతాలనే కురిపిస్తాడు
ఆత్మీయతల జల్లులు కురిపించే
ఆకాశ పందిరి నీడలలో శశి వెలుగుల
జాడలలో అమ్మమ్మగారింట అనుభవించిన
సాయం సామూహిక భోజనాల మధురిమలు
జీవితానికి సరిపడే ఆనందాలను మిగిల్చింది.....
కాలుష్యాల కబంధహస్తాలలో
విశ్వం చిక్కుముడి పడ్డాక
దండి గొలిపిన నిండు పౌర్ణమిల
వెండి వెలుగుల జాడల వెదుకులాటలాయె .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment