నిప్పుల వాన
తేది: 04-05-2022
శీర్షిక: మేలుకో ఓ మనిషి
కవిత సంఖ్య: 896
విజ్ఞానంలో విదుషీమణులమని
విర్రవీగే వింత జంతువు మనిషి...
ప్రకృతి పాఠాలను పరిగణించకుండానే
పటాటోపాలే అభివృద్దంటున్నాడు….
పశువులు సైతం ఆకలికే పరిమితమయి
పక్కవాటిని వేటాడుతుంటే... మనిషి
మాత్రం.. కారణాలు వెదుక్కుంటూ కాలు
దువ్వుతూ మారణహోమాల మంట
రగిలిస్తున్నాడు ...
ఊరికే ఉంటే ఊరా పేరాన్నట్టు
కోతినుండి వచ్చాడనడానికి ఇవే
నిత్య నిదర్శనాలని ప్రదర్శిస్తూ
ఉనికిని జారిపోకుండా అక్కున
చేర్చుకుంటున్నాడు...
చెట్టు చేమ గుట్ట వాగు వంత ....
అది ఇది అను బేధము లెరుగక
అధికార మదాంధముల ... అన్నిటినీ
పోగేసుకొని చెరబడుతున్నాడు .... మనిషి ....
అవనిమాత అంతరాంతాలను
అతలాకుతలం చేస్తూ ... ధాతువులని
ఖనిజాలని ... వాయువులని ..... చేతి
వాటం చూపిస్తూ కొల్లగొడుతున్నారు ......
పామును పక్కలో పాడుకోబెట్టుకున్నట్టు
పాలిథీన్లను ప్రతిపనిలో వాడుతూ
నేలతల్లిని .... నదీమతల్లుల్ని ....
కలుషితాలకాసారాలుగా చేస్తుంటే ......
భగ భగ మంటలతో భానుడి
ప్రతాపాలు వెళ్లగక్కుతూ .... నిప్పుల
వర్షాలు కుమ్మరిస్తున్నాయి ....
అనావృష్టికి కారణమయి ఎడారులు
కాకముందే మేలుకో ఓ మనిషి ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment