సమూహ సంఖ్య : 41
తేది : 18-12-2022
అంశం :
సాయంత్రం ఆరైంది . అప్పుడే ఆఫీస్
నుండి వచ్చిన శ్రీవారికి టీ పెడదామని
కిచెన్ వైపు అడుగులు వేసింది జ్యోతి ....
కథ - తేలికైన మనసు.
నిత్యం దినపత్రికల పతాక శీర్షికలలో పదిలమై నిలిచే మాంచెస్టర్త అఫ్ ఇండియా గా పేరొంది తనకంటూ ప్రత్యేక స్థానం పదిల పరుచుకున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో, ఈ మధ్యనే ఒక కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థ
విద్యుదుత్పాదనకై
ఏర్పడింది. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలతో , నూతన విధి విధానాలతో, వినూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని అతిపెద్ద సామర్థ్యముతో ప్రారంభమైంది.
అసలైన ప్రభుత్వ పని విధానాలకు భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలతో ...ఘనమైన ఉద్దేశాలతో ...ఉన్నతమైన నాణ్యతా విధానాలతో. ..సమున్నతమైన లక్ష్యాలతో ... సలక్షణమైన మిషన్ తో...సందర్బోచితమైన విజన్ తో ...అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ... భరత జాతి కీర్తులను ఇనుమడింపచేయాలని ప్ రజల మన్ననలు అందుకోవడంలో ఎప్పటికప్పుడు కృషి చేయాలనే సత్సంకల్పంతో భారీ ఎత్తున దేశం నలుమూలలా ప్రాజెక్టులను స్థాపించడం జరిగినది . అందులో భాగంగానే రామగుండంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనది.
సంస్థ ఏర్పడి ఏర్పడగానే , అప్పటికే సింగరేణిలో మంచి ఉద్యోగం మంచి పొజిషన్ లో ఉన్న రాజేష్ ఆ ఉద్యోగాన్ని ఆ హోదాను వదులుకుని ఎంతో ప్రత్యేకమైన అభిరుచితో కొత్త సంస్థలో జాయిన్ కావడం అంతా ఒక సంవత్సరంలోనే జరిగిపోయింది. ఆ తదుపరి సంవత్సరమే రాజేష్ పెళ్లి కూడా జ్యోతితో జరిగిపోయింది.
నాణ్యతలలో భాగంగానే రాబోయే కా లుష్యాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తికన్నా ముందుగానే ఉన్నతమైన ప్రణాళికలతో ఖాలీ స్థలాలను గుర్తిస్తూ అంకిత భావాల మనస్తత్వములున్న హార్టీ కల్చరు విభాగము వారి కృషితో అద్భుతమైన పచ్చ పచ్చని వన సమూహాలు....ఇటు ఇళ్ల సముదాయాలలోను ...అటు పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలలోను మరియు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాంతంలోను ...విస్తరింప చేసి, పరిసరాలలో ఉండే వాతావరణం కంటే కూడా వైవిధ్యభరితంగా రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించే విధంగా లక్షల చెట్లను నాటించారు. ...
పుచ్చపువ్వోలె విచ్చుకుని మరకతమై సముద్రములా విస్తరించిన పదివేల ఎకరాలలో ఇక్కడి వన సమూహాల ప్రభావం చూసి ... పక్కనే ఉన్న సింగరేణి సంస్థ ఉన్నత అధికారులలో కూడా... అప్పుడు కదలికలు వచ్చాయంటే ... ఆలోచించండి . ఇకపోతే శుచి శుభ్రతలు.. సెంట్రల్ సిలబస్ తో బడి , దేవాలయాల కాంప్లెక్స్ , పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, షాపింగులు, పార్కులు ఇరువై నాలుగు గంటలు నీరు, కరంటు సౌకర్యం, దోమలు లేకుండా టౌన్ షిప్ లోపల మరియు చుట్టుపక్కల పది పల్లెటూళ్లకు కూడా ప్రత్యేకమైన దోమల నివారణ విధానం, ఒక్కటేమిటి అన్నివిధాలా ... ఇతరత్రా సకల సౌకర్యాలతో ... ఎన్నో .. ఎన్నెన్నో... లేనిదంటూ లేదు ...
సంవత్సరాలు గడుస్తున్నాయి . అనుకున్న గమ్యాలకంటే ఎక్కువ ఉత్పత్తులనే కొనసాగిస్తూ
నవరత్నాలలో ఒదిగి పోయి ... మహారత్నగా ఎదిగినది. ఎప్పటికప్పుడు ఇంతటి కాలానుగుణమైన విశ్వ శ్రేష్ఠ మహోన్నత ఫలితాలకు ఉద్యోగుల సేవలు కూడా అనన్యమైనవి మరువలేనివి.
మిత్రులు గాని దూరపు బంధువులు గాని ఇంటికెవరైనా వస్తే ... " అరె మీరు మరో అమెరికాలో ఉన్నట్టుంది " అంటుంటే మనసు లోలోపలనే అమ్మానాన్నలకు పదే పదే నమస్కరించుకున్న సందర్భాలనేకం.
......
అందమైన కుటుంబం. హాయిగా రోజులు గడిచి పోతున్నాయి. తిరిగి చూసుకుంటే రాజేష్ కు ఉద్యోగంలో చేరి 20 సంవత్సరాలు గడిచిపోయింది. రాజేష్ విత్త విభాగములోని చెల్లింపుల సెక్షన్ లో అధికారిగా పని చేస్తున్నాడు .. అయన భార్య జ్యోతి డిగ్రీ వరకు చదువుకున్నది. అణుకువలో ఆణిముత్యం . ఇద్దరు పిల్లలు స్రవంత్ కుమార్ మరియు శ్వేత . చదువుల్లో చంద్రులు . పోటా పోటీగ చదువుకుంటున్న ప్రతిభావంతులు . ప్రతి సంవత్సరం క్లాస్ లో ఒకటవ రాంకు లేదా రెండవ రాంకు ఇద్దరికిని వారి వారి తరగతుల్లో .
ఇక రాజేష్ అమ్మా నాన్నలు మొన్న మొన్నటివరకు సొంతూరిలోనే ఉండేవారు. కానీ ఈ మధ్యనే నాన్నగారి నిర్యాణం తర్వాత అమ్మగారిని ఇక్కడికే తీసుకొచ్చారు . నాన్నగారు పోయిన బాధ అందరికంటే ఆమె ఎక్కువ అనుభవిస్తున్నది . అమ్మ గారి ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్నది. అయినా అంతా అరమరికలు లేకుండా సాగిపోతున్నది వారి పండంటి జీవితం .
క్రమశిక్షణలకు మారు పేరుగా కనుసైగలతోనే పిల్లలకు సూచనలివ్వడంలో జ్యోతికి ఎవరు సాటిరారని చుట్టుపక్కల ఉండే జ్యోతి మిత్రులందరూ అప్పుడప్పుడు అంటూంటారు . అత్తగారి దగ్గరనుండి అందిపుచ్చుకున్న సంప్రదాయమాయె. పిల్లలిద్దరు స్రవంత్ కుమార్ శ్వేత బడినుండి రాగానే బుద్దిగా ఏ రోజుకా రోజు అధ్యాపకులిచ్చిన హోమ్ వర్కులు నిత్యం చేసేసుకుంటారు. ఆలా చేసుకోవడమనేది చిన్న తరగతులనుండి జ్యోతి చేసిన అలవాటు
క్రమశిక్షణ. ప్రస్తుతం 12 వ తరగతి 10 వ తరగతిలో చదువుకుంటున్నారు. ప్రతి రోజులాగానే ఆరోజు కూడా హోమ్ వర్కులు
చేసుకున్నాక , అప్పుడే పిల్లలిద్దరిని మిత్రు లతో కలిసి ఆడుకుంటామంటే పక్కనే ఉన్న పార్కుకు పంపించింది జ్యోతి.
.......
ఆ రోజు గవర్నమెంట్ ఆడిట్ కూడా ఉంటుందని పొద్దునే ఆఫీసుకు వెళ్లే సమయంలో తెలిపాడు. పెద్ద ఎత్తున చెల్లింపుల సెక్షన్ కాబట్టి రోజువారీ పని ఒత్తిడే కాకుండా దానికి తోడు అదనంగా ఆ రోజు ఆడిట్ టీముతో కూడా సమన్వయము చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి అలిసి పోయి వస్తారని కాచుకుని మరీ ఎదురు చూస్తుంది జ్యోతి.
అనుకునేంతలోనే సాయంత్రం ఆరు కావస్తుంది. రాజేష్ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడన్న మాటే కానీ రోజులాగ హుషారుగా కనిపించడంలేదు . ఒక్క నిమిషంలో కనిపెట్టింది, అయినా వెంటనే ఏమి అడగలేదు. కాస్త టీ తాగినాక నెమ్మదిగ తర్వాత తెలుసుకోవచ్చులే అనుకుంది. అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన శ్రీవారికి టీ పెడదామని కిచెన్ వైపు అడుగులు వేసింది జ్యోతి ... ఏమై ఉంటుందా అని మనసులో ఆలోచిస్తూనే .
.....
అదే సమయంలో రాజేశేమో ఆఫీసులో అడిషనల్ జనరల్ మేనేజర్ శర్మగారితో జరిగిన చర్చ సారాంశం... జ్యోతితో ఎలా చెప్పాలని, అమ్మకెలా తెలియజేయాలని , విషయాన్ని ఎలా మొదలు పెట్టాలని అనేక విధాలుగా మనసులో ఆరాటపడి పోతూ జరిగిన చర్చను మరోసారి నెమరు వేసుకుంటున్నాడు
.....
ఏ రోజుకు ఆ రోజు ఆఫీసులో పనంతా అయిపోయిగానే ప్రతి రోజు సాయంత్రం చెల్లింపుల విభాగం కాబట్టి, బ్యాంకు నిలువలు చూసుకుని రేపటి కొరకు ఎంత ఫండ్ అవసరం ఉంటుదనేది లెక్కలేసుకుని , కార్పొరేట్ ఆఫీసుకు ఫండ్ రిక్విజిషన్ వివరాలతో ఒక రిపోర్ట్ తయారు చేసి రాజేష్ విత్త విభాగం ఇంచార్జి అయిన అడిషనల్ జనరల్ మేనేజర్ శర్మ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని మెయిల్ చేయడం రోజువారీ ప్రత్యేక పని ఉంటుంది .
యదావిధిగా ఆ రోజు సాయంత్రం కూడా అడిషనల్ జనరల్ మేనేజర్ శర్మ గారి దగ్గరికి, ఆనాటి రిపోర్టుతో వెళ్ళాడు రాజేష్ . అందులోని వివరాలన్నీ శర్మగారు మరొక్కసారి చెక్ చేసుకుని, కొన్నిఅదనపు వివరా లడిగి సంతృప్తి చెందాక సంతకం చేసేసారు .
ఆ తదుపరి ఆనాటి ఆడిట్ విషయాలు కూడా అడిగి తెలుసుకుని , ఎలాంటి ప్రత్యేకమైన రిమార్కులు లేవన్నప్పుడు చాలా ఆనంద పడిపోయారు శర్మగారు. అందుకొరకు ప్రత్యేకంగా చేతిలో చేయి కలిపి మరీ అభినందనలు కూడా తెలిపారు .
" ఏమాటకామాటే చెప్పుకోవాలి రాజేష్... నీవు ఈ సెక్షన్ కు వచ్చాక, నాకు చాలా భారం తగ్గింది సుమా " అంటూ మళ్ళీ
అభినందిస్తూనే శర్మగారు అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు.
"నీకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది ... కానీ కార్పొరేట్ పాలిసీ ప్రకారం ఇరువదేండ్ల కంటే ఎక్కువ రోజులు ఉన్నవారికి ఇంటర్ ప్రాజెక్టు ట్రాన్సఫర్ కింద ఛత్తీస్ గడ్ కోర్బా ప్లాంట్ కు ట్రాన్సఫర్ చేశారంటూ" శర్మగారు కొంత బాధను వ్యక్తపరుస్తూ తెలిపాడు. "ఒకవేళ ప్రమోషన్ వద్దనుకుంటే రిటైన్ అయ్యే ఆస్కారము కూడా ఉంది " అని కూడా తెలిపాడు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా నిర్మలమైన నీటి కొలనులో ఎవరో రాయి విసిరినట్టుగా ....గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి రాజేష్ కు . నాన్నగారు చనిపోయి మరీ 3 నెలలే అయ్యింది . అమ్మ ఇంకా పూర్తిగా మానసికంగా కుదురుకోలేదు . అటు పిల్లలు చూస్తే ఇద్దరు బోర్డు పరీక్షలు .. ఇక జ్యోతి సంగతి చూస్తే హిందీ ప్రాంతం. హిందీ భాష అర్థం చేసుకోగలదు కానీ మాట్లాడడమే కష్టం. వెళ్లాలన్నా ... రావాలన్నా 24 నాలుగు గంటల ప్రయాణం . ప్రతీ ప్రయాణం ముందుగా ప్రణాళిక చేసుకుంటేనే రిజర్వేషన్ సౌకర్యంగా దొరుకుతుంది .
అత్యవసరాలలో ఎలా అనుకుంటూ... పరిపరి విధాలా ఆలోచిస్తూ, ఇంతకు ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ... జ్యోతికి అమ్మకు పిల్లలకు ఎలా చెప్పాలి అనుకుంటూ ఆ ప్రాజెక్టు లో ఉన్న ఇరువదేండ్ల అనుబంధం గురించి రాజేష్ మనసు ఒక్కసారిగా తాను ఆ ప్రాజెక్ట్ లో చేరిన దగ్గర నుండి ఆ ప్రాంతంలో ఇరువదేండ్ల నుండి పని చేస్తున్న అనుబంధాలను నెమరు వేసుకుంటున్నాడు.
........
ఇలా అనేక విషయాలు రాజేష్ మనసులో మననానికి వచ్చి ... కొత్త ప్రదేశంలో ఎలా
సర్దుబాటు కావాలి... పిల్లల చదువులు ... అమ్మ ఆరోగ్యం ... భార్యకు కూడా హిందీ ప్రాంతమని .... అనేక రకాల ఆలోచిస్తూ ... ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అనే సంశయంతో అప్పుడే ఇంటికి చేరుకున్నాడు . వచ్చాడన్న మాటేగాని, రోజులాగా చలాకీగా అందుకే కనిపించడం లేదు. అలసటగా ఉన్నట్లనిపించింది . ఏమై ఉంటుందా అని జ్యోతి హైరానా పడిపోతున్నది . .....
"ఏమండీ" అన్న జ్యోతి పిలుపుకు ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు .
తాను తీసుకుని వచ్చిన టీ చేతికిచ్చింది ... ఇక గ్రహించిన విషయాన్ని ఉండబట్టలేక అడిగి తెలుసుకున్నది. అంతా విని చాలా కూల్ గా
"అదేమిటండీ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తే ఎగిరి గంతేయాలి ... ఆనందించాలి... చిన్న పెద్ద అడ్డంకులు కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ట్రాన్సఫర్ అనే చిన్న విషయానికి ఇంతగా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మన ఎన్టీపిసి ప్రాంతమే కదండీ.... ఇలాంటి టౌన్ షిప్పే కదా".
"ప్రస్తుతానికి మీరు వెళ్ళండి, పిల్లల పరీక్షల వరకు నేను ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటాను. ఎలాగూ పిల్లలు పైసంవత్సరం నుండి బాబు కాలేజీకి వెళతాడు, కావాలంటే పాపను కూడా ఏదైనా మంచి జూనియర్ కాలేజ్ లో చేర్పిద్దాం . ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు "
అంటూ జ్యోతి ధైర్యం ఇవ్వడం తో రాజేష్ మనసు చాలా తేలికైనది ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రతి మగవారి విజయం వెనక ఆడవారి హస్తముంటుందంటే ఇదేనేమో అనుకుని , వివరాలన్నీ అమ్మ తో పిల్లలతో చెప్పాడు. అంతా ప్రశాంతంగా జరిగిపోయింది.
......
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment