ప్రతిస్పందన
తేది : 15-12-2022
శీర్షిక : ప్రతి చర్య
కవిత సంఖ్య : సహస్రాధికం
ప్రాణమున్నదా ..లేదాన్నది...
పసలేని ప్రశ్న .. చర్యకు ప్రతిచర్య
ప్రకృతిపరమైన పరిపాటిగా జరిగి
ఫలితాలను ప్రదర్శించే ప్రక్రియనే ..
పట్టువస్త్రాలు కట్టుకుని పడతులంతా
పేరంటాలకెళ్లినంత శోభాయమానంగా
బుట్ట బొమ్మల్లా తీర్చి దిద్దుతున్నామన్నంత
ఆనందాలతో పుట్టగొడుగులైపోతున్న
పట్టణీకరణలు ...
ఆవిరియంత్రం ఆవిష్కరణలతో
విలాసాలన్నీ వింతగా రూపాంతరమై
అవసరాలుగా ఆవిర్భవిస్తుంటే ...
మలకలేసిన గొలుసులా ఒకటికొకటై
పారిశ్రామికీకరణల పరుగులతో
పలాయనమౌతున్న పర్యావరణం ....
కాలుష్య విత్తనాలను కసిగా వెదజల్లుతూ
ప్రజలు .. అధికారులు ... పాలకులు
యధాశక్తిగా తలో చేయి వేస్తూనే
పుణ్యం మూట కట్టుకుంటున్నారు ....
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ...
చెవినిల్లు కట్టుకుని శంఖమూదినట్టుగా
ఏండ్ల నుండి పర్యావరణవేత్తలు
ప్రజలకు ...పాలకులకు వినతులిచ్ చినా ...
కుంచాలతో కొలిసినట్టుగా తెచ్చి
రాశులు పోస్తూ...ఊళ్లన్నింటికీ పోలు
పోసినట్టుగా ..చెత్త కుప్పలతో కంచెలు
కడుతుంటే...చూపులన్నీ నిశ్చేష్టులై
శ్వాసలన్నీ విషతుల్యాలై
ఊపిరులూదుకుంటున్నాయి...
ప్రజా క్షేమాలకు పటుత్వం కల్పిస్తున్నామంటూ
అంగబలం అర్థబలం అధికారబలం అండగా
ప్రజలకోసమంటూ చిలకపలుకులు చిలకరిస్తూ
కొండా కోనలపై కొరడా ఝుళిపిస్తున్నాయి...
వాగు వంకలకు వాతలు పెడుతున్నాయి ....
ఒక్కటనేమిటి ... పైన లోపల భూమితల్లిని
పొక్కిలిస్తుంటే ... చెట్టూ... చేమ .. గట్టు ...
వాగు ... వంక... భూగర్భజలాలు .. తాగునీరు ...
ప్రాణ వాయువులు ... అన్నీ కాలుష్యాలకు కన్న
పిల్లలై పోతున్నాయి ...
నగునూరి
No comments:
Post a Comment