చిత్ర కవిత
తేది : 23-12-2022
శీర్షిక : జంతు ధర్మం ...
కవిత సంఖ్య : 200
కలికాలమో ... కాని కాలమో ...
ధర్మం ఒంటిరిదైనదన్న దాఖలలో ...
పంచతంత్రంలో పరితపించి
పిల్ల తల్లిని వదిలిన సింహారాజమే
మిన్న ...
పాపపుణ్యాలు పట్టక ...సిగ్గు ఎగ్గుల
చింతనలు వదిలి సింగారించుకుని...
డాంబిక గాంభీర్యతలు ఒలకబోస్తూ.. .
మత్త గజములై సంచరిస్తున్న ఎంతో మంది
కలియుగ నాయకులలా...కదులుతున్న వైనం ...
కనికరం లేని కొంతమంది కసాయి
నిండిన గుండెల పాలకులలా...స్వార్థ
చింతనల విషతుల్యాలు తనువెల్లా నింపుకుని...
రుధిరం మదించి స్వేదం చిందించే
శ్రామికులపై అనేక పన్నులు రుద్దుతూ...
ఖజానాలు సర్వత్రా నింపుకుంటూ ...
సగటు మనిషిని అడ్డంగా నడ్డి విరిచేస్తూ ....
బొక్కసాలన్నీ బుక్కడానికే సరిపోవడం
లేదన్నట్టుగా...పిల్ల తల్లిని నోట కరిచిన
హృదయ విదారకమైన దృశ్యం ....
అయినను ....
జీవరాశిలో మిన్నని విర్రవీగే మనిషి
కన్నా గొప్పే ...రేపటి చింతలు అలవర్చుకోక…
అప్పటికప్పుడు ఆకలి మాత్రమే తీర్చుకునే ....
జంతు ధర్మం ఒకింత గొప్పదని చెప్పవచ్చు..
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment