Sunday, August 18, 2019

నీరాకకోసం

అంశం - నీరాకకోసం
తేదీ -- 17-08-2019 
శీర్షిక - ఓ మానవత్వమా ....
సంఖ్య -  264

వేదం నాలుగు యుగాలంటుంది
మానవ కాల గమనాల కొలమానం...  
సత్య ధర్మ న్యాయ క్షీణత ప్రస్తావించి 
స్వార్ధం స్వారీ చేస్తుందని సూచించింది... 
  
శాస్త్రం లక్షల సంవత్సరాలంటుంది
చారిత్రక ఆనవాళ్లు... మానవాళి మార్పు...   
దినదిన ప్రవర్ధమని ఉటంకించింది 
విశ్వ మానవ నాగరికతల చిత్రమాలిక.... 

పారిశ్రామికత అంటే పతనానికి పథమా ?
పురికొలిపే మానవత కోటకు బీటలు..... 
సాంకేతికత విప్లవం అంటే సంకేతమా?  
మానవాళి సమూల సర్వ నాశనానికి....  

నాగరికత పెరిగితే నాశనం కోరుతుందా ?
సాటి మనిషికి సూటిగా హాని తలపెడుతుందా?  
ఖండాంతరాలు దాటితే కఠినత్వం పెరుగుతుందా?
మాతృ మూర్తుల సైతం మరుపు గొలుపుతుందా ?

జ్ఞానం పెరిగితే మానవత్వం కోరాలి....  
హోదాలు పెరిగితే విలువలు పెంచుకోవాలి....  
సంపద పెరిగితే దాతృత్వం పెంపొందిచుకోవాలి....  
యాంత్రికత పెరిగితే పొరుగును ప్రేమించాలి... 
ఆశయ అనుపానుల సాధనకు గగనపు గమ్యాల చేరికకు  
ఉత్తమ శిఖరాల అధిరోహణకు ప్రవర్ధమానత పదిలం చేస్తూ 
సత్యం ధర్మం న్యాయం సమన్వయపరుస్తూ 
నిత్యం తోడు నిలువుమా ఓ మానవత్వమా .... 
  
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

No comments:

Post a Comment