Tuesday, August 21, 2018

ప్రకృతి విపత్తులు

అంశం : ప్రకృతి విపత్తులు 
20-08-2018
శీర్షిక : అనాహుత అతిథులు
కవిత సంఖ్య: 35

పంచ భూతములు పవిత్రమన్న దేశం 
ప్రకృతిలో ఉండే కొండ, కోన, వాగు, వంక, 
జంతు,పశు,పక్షాదులు అన్నీ అమ్మ పేగు బంధమే. 
అది గుర్తెరిగి మసిలితే అంత సుఖప్రదమే. 

ఉత్తరాన హిమాలయాలు,ఎన్నెన్నో జీవనదులు 
ఆరావళి,వింధ్య పర్వత శ్రేణులు ,పీఠభూములు,
పశ్చిమ తూర్పు కనుమలు పహారా గా నిలిచే 
పవిత్ర సైనికులు మన దేశనిధికి  వెన్నెముకలు.  

అతివృష్టి,తుఫానులు,ఉప్పెనలు,సునామీలు 
భూకంపాలు, దావాలనాలు ,లావాలు,పిడుగులు  
పేరేదైనా పెను ముప్పే విపత్తు విద్వంసం.   
అన్నీ చెప్పకుండ వచ్చే అనాహుత అతిథులే. 
ముష్కరులకన్నా మూర్ఖం,టెర్రరిస్టులకన్నా భయంకరం. 
కొన్ని ప్రకృతి రీత్యా, ఇంకొన్ని మానవ తప్పిదాలు.  

ఇల్లు,వాకిళ్లు,ఆస్తులు,అంతస్తులు  సర్వం పోయి 
ఆడ,మగ,పిల్లా,పాప,ముసలి,ముతక,గొడ్డు,గోదా 
ధనిక,పేద,పశువులు,పక్షులు, జంతువులు, అందరూ 
తాగడానికి నీరులేక,తినడానికి తిండి లేక,
కట్టు బట్ట లేక ,కావాలసిన వైద్య సహాయాలందక 
కళ్ళ ముందే కావాల్సిన వాళ్ళను కార్చిచ్చు కబళించుకు పోతుంటే, 
కళేబరాల కుళ్ళు భరిస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవి చూస్తున్నారు. 

అప్పుడప్పుడు  అంతా  జయించాననుకుంటున్న 
మానవునికి ప్రకృతి వైపరీత్యాలు సదా పెను సవాళ్లు.  
సమయ స్ఫూర్తిని  సంధించి , ధైర్యాన్ని పోగుచేసుకుని 
ఆత్మ స్థైర్యాన్ని కూడగట్టుకుని, ఎదురొడ్డి గెలవాల్సిందే. 

సంఘమై సంక్షేమం చూడాల్సిన నాయకులు  
రాజకీయ రంగులు, రంకులు బొంకులు మాని, 
అమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు అప్రమత్తమై,
పత్రికలూ, మీడియాలు, పలు పారిశ్రామికులు,
ప్రజలు,స్వచ్చంద సేవా సంస్థలు అందరూ ఒక్కటై 
అశనిపాతమై నిలిచిన అన్నార్తులకు ఆపన్న హస్తం అందించాల్సిందే.  

No comments:

Post a Comment