Sunday, October 11, 2020

కథావేదిక - 4

 కథావేదిక - 4 

అంశం : వృద్ధాశ్రమం లో ఉన్న మామ గారిని తలుచుకుని, కళ్ళల్లో నిండిన తడి కనపడకుండా తుడుచుకుని.. ఓ దీర్ఘ శ్వాస తీసి.... వృద్దాశ్రమం లో ఉన్న మామయ్యగారిని తీసుకురావడానికి పెద్ద మనసు చేసుకుని... భర్తతో కల్సి బయలు దేరింది. 

శీర్షిక :  కాల మహిమంటే ఇదేనేమో !
*******************************

ఆధునిక పోకడల ఛాయలైన 
అపార్టుమెంట్ ల సంస్కృతిని, మెగా షాపింగ్ మాల్స్ ను,  అన్నీ కలిపి ఒకేచోట సమకూరే బహుళార్ధ సాధక  ముల్టీప్లెక్స్ లను పొదువుకుంటూ...   మెల్ల మెల్లగా పట్టణం నుండి పరిణతి చెంది  అప్పుడప్పుడే కొత్తగా నగరంగా పరిణామం చెందుతున్న....రామాయం  పేటలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంకులో  మేనేజర్ గా పని చేస్తున్న  కామేశ్వర రావు భార్య కామేశ్వరితో కలిసి నివసిస్తున్నారు. 

 కామేశ్వర రావు గారు ఉద్యోగరీత్యా ప్రతి మూడు సంవత్సరాలకు వేర్వేరు ప్రదేశాలు తిరగవలసి రావడం మూలాన...వాళ్ళ అమ్మగారైన రామలక్ష్మి గారు చనిపోయాక, నాన్న గారికి పెరిగిన చాదస్తం దృష్ట్యా, తండ్రి సాంబశివ రావు గారిని వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండే వృద్ధాశ్రమంలో ఉంచారు.    

అప్పుడెప్పుడో అనధికారికంగా... కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ ప్రవేశపెట్టిన ప్రచ్ఛన్న కుటుంబ నియంత్రణ పథకం తాలూకా ఫలితాలనుకుంటా .... మేమిద్దరం.... మాకిద్దరు చాలంటూ ...  ముద్దు ముద్దుగా చాలా కుటుంబాలు   ఇద్దరికే పరిమితమయి పోయాయి. అదే కోవలో కామేశ్వర రావు కామేశ్వరి గార్ల  కుటుంబం కూడా చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబమంటూ... ఇద్దరు పిల్లలకే  పరిమితం చేసుకున్నారు. 

ఈ మధ్యనే తెలుగు రాష్ట్ర ప్రభుత్వ చొరవలతో తెరువబడ్డ అనేక వృత్తి విద్యా కళాశాలల పుణ్యమాని.....  పిల్లలంతా విదేశాల్లో స్థిరపడి 
పోతున్నారు. కామేశ్వర రావు గారి అబ్బాయి సూర్య తేజ B.Tech  తర్వాత   MS  కొరకని  అమెరికా వెళ్లి అక్కడే  స్థిరపడ్డాడు. ఇక అమ్మాయి హరి చందన కూడా MBBS తర్వాత specialisation  కొరకంటూ  లండన్ వెళ్లి చదువు పూర్తవగానే అక్కడే ఉద్యోగంలో స్థిరపడి పోయింది. 

 ప్రశాంతంగా సాగిపోతున్న కామేశ్వర రావు కామేశ్వరీల  జీవితంలో ఉన్నట్టుండి పెద్ద కుదుపే వచ్చింది.  
తుఫానులా వచ్చి సునామీలా విస్తరించిన  కరోనా భూతం...  పంజా విసిరింది.  వారిద్దరి మనసులు కకా వికలమయ్యాయి. కారణాలు దేవి పోసుకున్నారు.  పరిస్థితులను విశ్లేషించుకున్నారు.  అశ్రద్ధలను ఆడిపోసుకున్నారు. భవిష్యత్తును వల్లె వేసుకున్నారు. ఇంతకీ కారణమేంటో పూర్తిగా తెలియ రాలేదు కానీ.... 

రోజువారీ విధుల్లో భాగంగా,  వివిధ రకాలైన ఖాతాదారులతో వ్యవహరిస్తున్నసందర్భంలో జరిపిన లావాదేవీల క్రమంలో  కావొచ్చు... ఈ మధ్యనే  కామేశ్వర రావు కొంత   అనారోగ్యం పాలైనారు. అనేక రకాల పరీక్షల అనంతరం కోవిద్ 19 గా నిర్ధారించబడి కరోనా లక్షణాల  ప్రభావమని తేల్చారు వైద్యులు .  ఎంతో మనోవేదనకు గురవుతూనే , తగిన  చికిత్స తీసుకున్నారు. చికిత్సలో భాగంగా క్వారంటైన్ కూడా పాటించి డాక్టరు గారిచ్చిన మందులు వాడుకున్నారు. వారికి వారే విమర్శించుకున్నారు,  నిందించుకున్నారు చివరికి  శత్రువులుగా కూడా భావించుకున్నారు. 

పిల్లలిద్దరూ ఎంతో ఆవేదన చెందారు . ఎక్కడి వారక్కడే  కంగారు పడినారు. మాటల్లో సూర్యతేజ వాళ్ళుంటున్న వర్జీనియా స్టేట్ రిచ్మండ్ టౌనులో కరోనా వలన వృద్దాశ్రమంలో ఈ మధ్యనే జరిగిన 42 మంది వృద్దుల తాలూకు విషాదం చెప్పి ఎంతో బాధ పడ్డాడు. 
హరిచందన స్వతహాగ డాక్టరు కాబట్టి భయపడకుండా డాక్టరు సలహాలు పాటించమని ధైర్య వచనాలు చెబుతూనే... మాటల్లో వయసు 70 దాటినా, లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే భయపడాలి లేదంటే ధైర్యంగా ఉండండి అని చెప్పింది. 

ఏదైతేనేం .... వైద్యుల సూచనల ప్రకారం తీసుకున్న చికిత్సకు , పాటించిన  14 రోజుల క్వారంటైన్  కాల నియమాలు  పుణ్యమాని ,  అన్నీ పాటించడంతో తిరిగి ఆరోగ్యవంతులయ్యారు.  క్వారంటైన్  కాలం గడిచిపోగానే, తిరిగి అన్ని రకాల పరీక్షలు చేయించుకుని  ఆరోగ్యవంతులని నిర్దారించుకున్నాక.... 

క్వారంటైన్  జీవితాన్ని మననం చేసుకుని భార్య భర్తలిద్దరు ఎంతో కుమిలి పోయారు.  చెరొక రూములో ఉండి పోయి క్వారంటైన్ నియమ నిబంధనలు పాటించిన క్రమములో గడిపిన ఒంటరి బ్రతుకు పోరాటంలో .... జరిగిన ఒక్కొక్క రోజును తలుచుకుని బాధపడ్డారు.  యుగంలా గడిచిన ఆ చీకటి రోజులను మరిచి పోలేక పోతున్నారు.  విదేశాల్లో ఉన్న పిల్లల గురించిన ఆలోచనలు, జరిపించాల్సిన వారి పెళ్లిళ్ల గురించిన ఆలోచనలు , పుట్టబోయే వారి పిల్లల గురించి... మనుమలు మనవరాళ్ల ముద్దు ముచ్చటల గురించి ... ఇలా అనేక రకాల ఆలోచనలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోకుండా చేసాయి... ఇప్పుడు కూడా చేస్తున్నాయి. భయం భయంగా బతికిన రోజులు... 
తదేకంగాచీకట్లోనే పైకప్పుకేసి వేలాడేసుకున్న కళ్ళు... చిన్న చిన్న శబ్దాలకే  భళ్ళుమని చెడగొట్టుకున్న  
ప్రశాంతతలు... మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు నిద్ర పట్టనిరాత్రులు ఇప్పుడు పదే పదే గుర్తుకొచ్చి భయ కంపితులను  చేస్తున్నాయి . 

పిల్లల మాటల ప్రభావమో లేక ఈ మధ్య వస్తున్న కరోనా వార్తలు.... పెద్ద వయసు వారికే ఎక్కువ రిస్కంటూ ... 
ముఖ్యంగా వృద్దాశ్రమాలపై చూపుతున్న ప్రభావాల కథనాలు  చూసో .. కామేశ్వరి మరియు కామేశ్వర రావు గార్లు ఎంతో మధన పడ్డారు. ఈ క్రమం లోనే కామేశ్వరి... మామ గారి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. భర్త కామేశ్వర రావుతో కలిసి విచారించింది. ప్రస్తుతానికి పిల్లలెలాగు మనతో లేరు. మామయ్య గారిని తీసుకొచ్చుకుందామని చెప్పింది. వృద్ధాశ్రమం లో ఉన్న మామ గారిని తలుచుకుని, కళ్ళల్లో నిండిన తడి కనపడకుండా తుడుచుకుని.. ఓ దీర్ఘ శ్వాస తీసి.... వృద్దాశ్రమం లో ఉన్న మామయ్యగారిని తీసుకురావడానికి  పెద్ద మనసు చేసుకుని... భర్తతో కల్సి బయలు దేరింది. 

ప్రపంచాన్నే గడగడ లాడించి పట్టుకుందామంటే దొరకని వింత సూక్ష్మ క్రిమి వినూతన పాఠాలనే బోధించింది విశ్వ ప్రజలందరికి. కంటికి కనపడని పురుగే అయినా పండంటి కాపురాలను కకావికలం చేసింది.  

అయినా ఓ గొప్ప విషయమేంటంటే...  ఎంతోమంది కరుణామయులను కూడా ప్రపంచానికి  పరిచయం చేసింది.  కఠినాత్ములకు సైతం కనువిప్పులు తెప్పించింది . కాల మహిమంటే ఇదేనేమో !                                                                                                      ***
అయిపొయింది. 

             

No comments:

Post a Comment