Sunday, October 11, 2020

కథా వేదిక-3 ........శీర్షిక : తెలుగింటి అమ్మాయి....

 "అప్పుడే .... మేల్కొన్న ఆమె 

అయ్యో..... ఇదంతా కలయా!... 
అబ్బ .... నిజమైతే... ఎంత బాగుండు..... 
అని తనలో ... తాను అనుకుంటూ.... 
అటూ ఇటూ చూసి మళ్ళీ నిద్రలోకి 
జారి పోయింది . "  
************************************
నగునూరి రాజన్న
కథా వేదిక-3 
శీర్షిక : తెలుగింటి అమ్మాయి.... 


అల్లంత దూరాన పట్టణానికి అవతలగా విసిరి వేయబడ్డట్టున్న చిన్న చిన్న ఇళ్ల లాంటి క్వార్టర్లలో కొత్తగా వచ్చిన కుటుంబాలు నివసిస్తున్నారు.  అదొక పారిశ్రామిక ప్రాంత ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించి ఇచ్చిన తాత్కాలిక నివాసాల సముదాయం. 

అక్కడ ఆఫీసులో జనరల్ షిఫ్ట్ లో  పని చేసే వారికి, కర్మాగారంలో మూడు షిఫ్ట్ లలో  పనిచేసే వారికి , అందరికి కలిపి ఆ నివాసాలు కేటాయించారు. అందరు గూడ  అప్పుడప్పుడే పెళ్లిళ్లు చేసుకుని వచ్చిన కొత్త జంటలు  లేదంటే ఒకరిద్దరు చిన్న చిన్న పిల్లలున్న భార్యాభర్తలు కలిగిన సంసారాలు. 

అందులోకి  విష్ణు తేజ  ఆదిలక్ష్మిల జంట కూడా కొత్తగా వచ్చి చేరారు. విష్ణు తేజ ఆ పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరుకు చెందినవాడు. కష్టపడి చదువుకుని కొత్తగా ఉద్యోగానికి వచ్చాడు. అప్పుడప్పుడే జీవితాన్ని , పల్లె పట్నం తేడాలను గమనిస్తూ బ్రతుకు బండికి పచ్చ జండా ఊపుతున్నాడు.  ఇక ఆదిలక్ష్మి మాత్రం ఓ చిన్న పట్టణం లో  ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. అమ్మా నాన్న అన్నయ్యలు, వదినలు మంది మార్బలం ఉన్న ఇంట్లో గారాబంగా  పెరిగిన అమ్మాయి. కాలు కింద పెడితే కమిలి పోతుందేమో  అన్నంత గారాబంగా
 పెంచుకున్నారు. 

ఉదయం పూట పూజ, ఫలహారం టీ అయిపోగానే విష్ణు తేజ ఆఫీసుకు వెళ్లి పోయాడు. ఇక ఆదిలక్ష్మికి  పొద్దు గడవడం కష్టంగా మారింది.  ఇల్లులన్నీ ఊరికి దూరంగా విసిరేసినట్టున్నందున, ఏ చిన్న వస్తువు కావాలన్న  సాయంత్రానికి  గాని ప్రత్యేకంగా వెళ్లి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. పాలు కూరగాయలు మాత్రం, అన్నీ దూరంగా ఉన్న ఊరు నుండి రైతులు సైకిళ్ళ మీద తీసుకుని వచ్చి ఇచ్చి వెల్తుంటారు.  పని మనుషులు కూడా దరి దాపుల్లో అందుబాటులో లేరు. 

అంతా  కొత్త కొత్త....  ఎవరితో మాట్లాడాలన్నా బెరుకు బెరుకుగా ఉంది . పలుకే బంగారంలా ఉన్నది. అలా పని చేసుకుంట , మధ్యాహ్నం తిన్న తర్వాత అలసిపోయి చిన్న కునుకు  తీసింది. 
                                 ***                        
"అమ్మా నాన్న అన్నయ్యలు అందరూ వచ్చేసారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. వాళ్ళతో పాటు రాజమ్మ (ఊరిలో పని అమ్మాయి )కూడా వచ్చింది. ఆదిలక్ష్మి కి ఎంతో ఆనందంగా ఉంది . అన్ని పనులు వాళ్ళే చకచకా చేసేసుకుంటున్నారు. తనకేమి పని చేసే సందర్భం కానీ అవసరం కానీ రావడమే లేదు. ఏదైతేనేం ఆదిలక్ష్మికి ఆనందంగా ఉంది.  ఎలా అవుతేనేం, తనకు కొంత అలవాటాయ్యేంత వరకు నడిచి పోతుందిలే "  అనుకుంటుండగానే  వంటింటిలోనుండి వచ్చిన చిన్న  చప్పుడుకు....  "అప్పుడే .... మేల్కొన్న ఆదిలక్ష్మి అయ్యో..... ఇదంతా కలయా!... అబ్బ .... నిజమైతే... ఎంత బాగుండు..... అని తనలో... తాను అనుకుంటూ.... గొనుక్కుని అటూ ఇటూ చూసి మళ్ళీ నిద్రలోకి జారి పోయింది . "  
                                          ***
ఉదయం నుండి కొత్త ఇళ్ళు అవడం మూలాన అన్ని స్వయంగా సర్దుకునే సరికి,  అలసటతో బాగా నిద్ర పట్టేసింది.  సాయంత్రం విష్ణు తేజ ఆఫీసు నుండి వచ్చి బెల్  మోగించే సరికి, ఒళ్ళు విరుచుకుంటూ బద్దకంగా వచ్చి తలుపు తీసింది. విష్ణుతేజ ఆఫీస్ లో జరిగిన ముచ్చట చెబుతుంటే కూడ ఆదిలక్ష్మి చాల పరధ్యాన్నంగా ఉండి మాట వినిపించుకున్నట్టు అనిపించక అంతటితో ఆగి పోయాడు. ఆదిలక్ష్మి ఏదో ఆలోచనలో ఉన్నట్టనిపించింది.  ఇంతకు తనకు వచ్చిన కల గురించి చెబితే భర్త ఎక్కడ బాధ పడతాడో అని తనలో తానే దాచుకుని, ఉన్న పరిస్థితులకు అలవాటు పడదామనుకుని  గట్టిగా నిర్ణయించుకున్నదై మహోన్నతమైన తెలుగింటి అమ్మాయిగా మారి పోయింది.  

 సాయంత్రానికల్లా ఆదిలక్ష్మికి  ఒకరిద్దరు పక్కింటి వదినమ్మలు పరిచయమయ్యారు. రెండు మూడు రోజులయ్యే సరికి ఆ వీధిలోని అందరు పరిచయమై పోయారు. ఇక మనసుకు కొంత ఊరట కలిగింది. అలా అలా వారి జీవిత ప్రయాణం చాలా సాఫీగా సాగిపోయింది . 
    
                        ***********
                                     అయిపోయినది. 

No comments:

Post a Comment