Thursday, November 5, 2020

కథారచన-5 తేది: 20-09-2020

తేది: 20-09-2020 శీర్షిక : చిరు కోపం కథావస్తువు.: “అయ్యో....ఈ విషయం తెలియక ఇంత కాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ.  నన్ను మన్నించండి" అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయింది. ఇన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి తెరపడింది.                                                  ...... ఎంతైనా కన్న తల్లి కదా ! ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఆ తల్లి మనసు తల్లడిల్లి    పోతున్నది. ప్రేమించి కొత్తగా పెళ్ళి చేసుకున్న పిల్లలాయె.... ఇవ్వాళ రేపటి పిల్లలు ఎంతగా అన్నీ తెలుసుకుని  మసులుకోగలరని తన మనసుకు సర్ది చెప్పుకున్నా,   మూడు రోజులనుండి మాట్లాడుకొకుండా ఉన్న ... కొడుకు కోడలు పరిస్థితికి  అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కళ్ళల్లోని నీళ్లు తుడుచుకుంటుంది. పరంధామయ్యగారేమో ఎలా కల్పించుకుని సర్దాలా అని ప్రయత్నిస్తున్నారు. అప్పుడే డ్యూటీ నుండి వచ్చిన కొడుకును, పరంధామయ్యగారు గంభీరంగా కదపడానికి ప్రయత్నిస్తున్నారు.                                                                 ******ఒకప్పటి మహారాజుల సంస్థానమైన గద్వాల్ పట్టణంలో జగదీశ్ ప్రసాద్  గారు ఒక పెద్ద పారిశ్రామిక వేత్త.  వారి  భార్య రుక్మిణి గారు కూడా లేడీస్ క్లబ్ లో  అధ్యక్షురాలుగా ఎన్నికయి,   ప్రతిరోజు  ఏవో   సాంస్కృతిక కార్యక్రమాలంటూ ,  అటు అధికారిక వర్గాలలో ఇటు వ్యాపార వర్గాలలో  పేరుకు పేరు  మరియు  సమాంతర  ప్రతిష్ట  సంపాదించుకున్నారు.  వారికి లేక లేక కలిగిన అపురూప సంతానం అలేఖ్య. జర్నలిజంలో  మాస్టర్స్  చేస్తున్నది.   కుటుంబంలో నెలకొన్న  పరిస్థితుల మూలంగా అమ్మా నాన్నలిద్దరు ఎప్పుడు ఇటు వ్యాపార , అటు సామజిక  పనుల ఒత్తిడులలో నిమగ్నమై క్షణం తీరిక లేని వాతావరణం.  అందువలన అలేఖ్య  పెంపకం చాలావరకు ఆయాల  చేతులమీదుగానే  జరిగింది.  అందుకేనేమో కూతురుకు ప్రతి చిన్న విషయానికి ముందుగా కోపం ఆ తదుపరి అంతా తెలుసుకుని  సర్దుకోవడం అలవాటయి పోయింది.  చదువులో ఎంతో హుషారు....  అడిగినదేదయినా క్షణాల్లో అమరిపోతూ,  చాలా గారాబంగా  పెరిగింది .  వారి గారాబమో .... పెరిగిన విధానమో  చూసే సినిమాల ప్రభావమో  గాని  సాహసాల సహవాసం పాళ్ళు కూడా ఎక్కువే. జగదీష్ ప్రసాద్ గారు  రుక్మిణి గారు వాళ్ళ  ఒక్కగానొక్కమ్మాయికి పెళ్లి సంబంధాలు  చూడాలని  ఆలోచిస్తున్నారు.   పరంధామయ్య  గారు  " ఏమేవ్ " అంటూ ఆనందంతో కూడిన కేక లాంటి పిలుపుతో భార్య అన్నపూర్ణను  పిలుస్తూ  ఇంట్లోకి ప్రవేశించాడు. ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగి పోయే ఆ మహా  ఇల్లాలు " వస్తున్నానండి "  అంటూ..తడి చేతిని కొంగుతో తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చి ... "చెప్పండి  ఏమిటీ మీ హడావుడి" అని  అడిగింది.  ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ మనసులో ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు . పరధ్యానంగా ఉన్న భర్తను చూసి "ఇంతకీ ఏంటండీ" అంటూ మళ్ళీ రెట్టించింది అన్నపూర్ణమ్మ.  "ఆ  దేవుడు కరుణించాడే " .... మనం మొక్కుకున్నట్టుగానే  మన అబ్బాయ్  పోస్టింగ్  మన ఊరికే వచ్చిందంటూ  చాలా సంతోషంగా .చెప్పాడు. ఆ  దంపతుల   ఆనందానికి  ఇక  అవధులే   లేవు. చిన్న చిన్న విషయాలకే   ఆనందించే మధ్య తరగతి వారికి అంతకన్నా ఇంకేమి కావాలి .... పదవ తరగతి తదుపరి పై చదువులకై కొన్నాళ్ళు , ఉద్యోగ రీత్యా ఇంకొన్నాళ్లు దూరంగా ఉన్న కొడుకు  దగ్గరికి రావడం.... అంతే కాకుండా ఇంకో వైపు ... పెళ్లీడుకొచ్చిన కొడుక్కి  పెళ్లి చేయాలన్న బాధ్యత మరో వైపు...  వెరసి ఆనందానికి అవధులు   లేవు.  ఇంతకీ విషయమేంటంటే ....గద్వాల్ పట్టణంలోనే  బడిని  గుడిలాగా, బడిలోని పిల్లలని తన స్వంత పిల్లలుగా  భావిస్తూ....దేశమంటే ఎనలేని ప్రేమ... గౌరవాలు కలిగిన పరంధామయ్య గారు ఆ ఊరి బడిలో టీచర్ వారి భార్య అన్నపూర్ణ...  ఒకగానొక్క  కొడుకు భరత్ వాళ్ళుండే ఇల్లది .   భరత్  చూడ చక్కని శరీర సౌష్టవంతో..... నాన్న గారి ఆశయాలకు తగినట్టుగానే  పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి పోగానే పెద్ద పోలీసాఫీసర్ ఉద్యోగంలో చేరాడు. అనతి కాలంలోనే  నిజాయితీ గల  అధికారిగా ధైర్య సాహసాలకు పెట్టింది పేరై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  సాధించుకున్నాడు, ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించుకుంటూ ,ఎన్నో సార్లు వార్తల్లో కూడా  నిలిచాడు. . ఆ యోగ్యతలతోనే, కోరుకున్న  విధంగా వాళ్ళూరికే బదిలీపై  వచ్చాడు.                                                                            ... చదువు పూర్తి చేసుకుని వృత్తిలో స్థిరపడ్డ ఆలేఖ్య వృత్తిలో భాగంగా  భరత్ తో ఎన్నో సందర్భాలలో  కలుసుకోవడం మరియు ఒకరినొకరు ఇష్టపడటం జరిగింది.  ఈ విషయం  అలేఖ్య వాళ్ళ  అమ్మా నాన్నల దృష్టికి వచ్చింది.  వారికి కూడా ఎలాంటి అభ్యంతరం కనపడలేదు కావున వారి వైపునుండి అనుమతి  నామ మాత్రమే అయ్యింది. ఇక  డబ్బు,  హోదాలలో కొంత వ్యత్యాసం కారణం చేత , భరత్  వాళ్ళ అమ్మా నాన్నలే  కొంత తటపటయిస్తున్న సందర్భములో ,  భరతే  పూనుకుని అమ్మానాన్నలను ఎలాగోలా.. ఒప్పించి  పెళ్ళికి అంగీకరింపచేసాడు.   ... కొత్త కోడలు అడుగు పెట్టిన శుభ సందర్భంగా పరంధామయ్య గారి ఇల్లంతా కళ కళలాడుతుంది.  రోజు అందరూ ఎవరి పనుల మీద వారంతా ఉరుకులుపరుగులే....పరంధామయ్యగారు, భరత్ మరియు అలేఖ్య.   ఇల్లంతా  రోజూ ఒకటే   హడావుడి . ఎక్కడి వారక్కడ డ్యూటీలకు వెళ్ళగానే  అన్నపూర్ణమ్మకు ఎంతో బోసిగా తోచేది.   అలాంటిది కొత్త కోడలు మూడు రోజులనుండి ముభావంగా ఎవరితోనూ మాట్లాడకుండా  మౌన దీక్ష చేస్తూ ఉండటంతో అన్నపూర్ణమ్మ గారికి కాలు చేయి ఆడటం లేదు.  ప్రవృత్తి రీత్యా కోడలు కోపంతో  ఉండటంతో ఎలా పరిష్కరించాలో అర్థం కాక బాధ పడుతున్నది.   ఇక పరంధామయ్యగారేమో కొడుకు రాకకై గాంభీర్యంగా ఎదురుచూస్తున్నాడు.                     *****నాన్నగారి మాట ఏనాడు మీరని భరత్  మూడు రోజుల కింద జరిగిన విషయం తద్వారా అలేఖ్య తప్పుగా అర్థం చేసుకుని,  తాను చెప్పే పూర్తి సమాచారాన్ని   వివరంగా వినకుండా  మౌనంగా ఉండిపోవడాన్ని సవివరంగా చెప్పాడు. "ఇంతకూ  ఆ రోజు ఎం జరిగిందో" వివరంగా చెప్పు అని పరంధామయ్య  గారు అడిగేసరికి  భరత్ "ఉద్యోగ నిర్వహణలో భాగంగా,  ఒక ఆడ ఖైదీని  కోర్టుకు తరలించాల్సి వచ్చింది " అనుకోకుండా " ఆ కేసు పూర్వాపరాలను దృష్టిలో ఉంచుకుని  నేను నా వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది.  అదే సమయంల మా వాహనం  కోర్టు ఆవరణలో ప్రవేశిస్తున్నప్పుడు  అలేఖ్య  చూసిన విషయాన్ని నేను గమనించాను. "   ఈ వివరమంతా చెబుదామనుకుంటే  అలేఖ్య అసలు వినే మూడ్ లోనే లేదు.  "ఇదీ జరిగిన విషయమంటూ"  ఏకరువు పెడుతున్నప్పుడు అలేఖ్య కూడా అక్కడే ఉండి విషయమంతా వివరంగా విని ....     "అయ్యో....ఈ విషయం తెలియక ఇంత కాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ. నన్ను మన్నించండి" అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయింది. ఇన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి తెరపడింది.   ...

No comments:

Post a Comment