అక్షర తూణీరం
తేది : 18-11-2021
అంశం : అనుభవైక లేపనాలు
కవిత సంఖ్య : 798
ప్రకృతికెవరు నేర్పారో పరుగుపెట్టి
కలిగినది పదుగురికి పంచమని...
పశుపక్ష్యాదులకెవరు నేర్పారో నేర్పుగా
కదులుతూ లక్ష్యము చేరుకొమ్మని ....
అన్నీ తెలుసునకుంటున్న మనిషి
మాత్రం అలసత్వాలకు మిత్రుడు
స్వార్థ సంకుచితత్వాలకు దత్త పుత్రుడు
అసూయ ద్వేషాల ఆరాధ్యుడు ....
అరిషడ్వార్గాలకు అపర వారసుడు ....
అందుకే అప్పుడప్పుడు దారి తప్పిన
అనుయాయులకు ఓదార్పు మంత్రాలై ....
మేకవన్నె పులులుగా మారి రోత పనులు
చేసే వారి పట్ల అంకుశాలుగా నిలుస్తాయి .....
కపటత్వాలకు కంటి పాపై... వేటగాడుగ
సాటి మనుషులనే సంహరించు వేళ ....
పౌరుషాల వారసత్వం పుణికి పుచుకుని
కరవాలములై కళ్ళెర్ర జేస్తాయి .....
నిత్య జీవన సమరంలో... నిరంతరం
ఎదురయ్యే మంచి చెడుల మతలబులకు...
మనసులో ఎగిసిపడే అలల భావాలెన్నో
అక్షర రూపాలై సేదలు దీరుస్తుంటాయి .....
కొన్నిసార్లు పరిమళాలు చిందిస్తూ ...
ఇంకొన్ని సార్లు ప్రశ్నలు సంధిస్తూ ...
మరికొన్ని సార్లు అగ్నిజ్వాలలు కురిపిస్తూ
అనుభవైక లేపనాలుగా అమిరిపోతూంటాయి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment