Saturday, July 9, 2016

రాజకీయం రాజుకుంటూనే ఉన్నది



రాజుల రోజులు పోయి  రాజ్యాలు మారినా 
రాజకీయం మాత్రం రావణ కాష్టం లా రాజుకుంటూనే ఉన్నది 

అరువదేండ్ల స్వాతంత్రంలో అవలోకనం అయ్యింది ఒక్కటే 
పేదోడి పేరు చెప్పి  పెత్తనాన్ని మాత్రమే  పంచుకుంటున్నారు 

రెక్కాడితే కాని డొక్కాడని పేదోడి బతుకు చిత్రం మారలేదు 
రాళ్ళు రప్పలు మోసే కూలోడి తలరాత మారలేదు 

కాలానుగుణంగా పక్షులు ప్రదేశాలు మారినట్టు 
కండువాలు మార్చుకుని పార్టీలు మారుతున్నరు మన నాయకులు 

పదవుల పంపకాలలో పరవశించి పోతున్నారు 
కడు హీనముగా ప్రవర్తిస్తూ కంపరం పుట్టిస్తున్నారు . 

ప్రజా ధనాన్ని లజ్జ వీడి  పసిగట్టి పదిలపరచు కుంటున్నారు 
పచ్చి బజారు మనుషుల్లా నాయకులు , అధికారులు ,బడా వ్యాపారులు . 

మనిషి "మనీ"షి  గా మారి  సాటి మనిషిని దోచుకుంటున్నాడు 
మనిషన్నవాడు మాయమై  విష జ్వాలలను విరజిమ్ముతున్నాడు.  

"మనీ"షి-మనిషిగా  మారకుంటే  మన మనుగడే మృగ్యమౌను 
"మనీ"షి- మృగమై సంచరించక ముందే మనమంతా మేల్కొనాలి. 

అక్షరాస్యత అభివృద్ధి జరిగితే అంతమౌను కొంతైనా ఈ  దోపిడీ 
సంఘ హితం కోరే సంస్కర్తలంతా- ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాలను 
పదిల పరచడానికి ప్రజా తంత్ర ప్రజా స్వామ్యాలను ప్రజా క్షేమాలను 

No comments:

Post a Comment